చెన్నై: మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మూసేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. అత్యంత అవినీతిమయమైన ఈ ఏజెన్సీ దేశానికి అవసరం లేదని తెలిపారు. తమిళనాడులోని కరైకుడిలో విలేకరులతో కార్తీ చిదంబరం మాట్లాడారు. తమిళనాడు విజిలెన్స్ విభాగం శుక్రవారం అరెస్టు చేసిన అంకిత్ తివారీ వంటి అవినీతి అధికారులతో ఈడీ నిండి ఉందని ఆరోపించారు. ‘అంకిత్ తివారీ వంటి వందలాది మంది అవినీతి అధికారులు ఈడీలో ఉన్నారు. అందుకే ఈడీని తప్పనిసరిగా మూసివేయాలి. సీబీఐలోని ఆర్థిక నేరాల విభాగం ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయగలదు. భారత్కు ఈడీ లాంటి ఏజెన్సీ అవసరం లేదు. అత్యంత అవినీతిపరులు నడుపుతున్న ఏజెన్సీ ఇది. ప్రజలను బెదిరించి వారి నుంచి లంచాలు తీసుకోవడం వారి పద్ధతి’ అని విమర్శించారు.
కాగా, చాలా మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారులు ఈడీలో పోస్ట్ పొందడానికి చాలా డబ్బులు ఖర్చు చేశారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ‘వారు లంచాలు ఇచ్చి ఈ పోస్ట్కు వెళ్తారు. ఆ డబ్బు తిరిగి పొందేందుకు లంచాలు తీసుకుంటారు. పీఎంఎల్ఏని వినియోగించి ఒక వ్యక్తి లావాదేవీల వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత సంబంధం లేని వ్యక్తులకు కూడా నోటీసులు లేదా సమన్లు జారీ చేస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న వేధింపుల కారణంగా, ఈడీ అధికారులకు వారు లంచాలు ఇస్తున్నారు’ అని విమర్శించారు.