భోపాల్ : ఎరువుల కొరతతో మనస్ధాపానికి లోనైన రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. రబీ సీజన్కు ముందు డీఏపీ ఎరువుకు రాష్ట్రమంతటా తీవ్ర కటకట నెలకొంది. దీంతో రబీ పంటకు డీఏపీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన బదిపిప్రోల్ గ్రామానికి చెందని ధనపాల్ యాదవ్ విషం సేవించి తనువు చాలించడం కలకలం రేపింది.
ధన్పాల్ గురువారం సాయంత్రం విషం తీసుకోగా వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. గతంలో యాదవ్ పంట చేతికిరాలేదని, ఈసారి ఎరువుల కొరత వెంటాడటంతో ఆయన తీవ్ర మనోవ్యధకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడని బాధిత రైతు బంధువు విజయ్ పాల్ యాదవ్ తెలిపారు. డీఏపీ కోసం గత రెండు వారాలుగా ధనపాల్ ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.