ముంబై : మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ను కూలదోసేందుకు కాషాయ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న శివసేన తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. రెబెల్ నేత ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ల మధ్య రహస్య భేటీ జరిగిందని, ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారని పేర్కొంది. ఈ సమావేశం తర్వాత రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వైప్లస్ సెక్యూరిటీ కల్పించిందని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన ఆరోపించింది.
రెబెల్ ఎమ్మెల్యేలందరూ రూ 50-55 కోట్లకు అమ్ముడుపోయారని పేర్కొంది. ఇక షిండే క్యాంప్కు చెందిన సేన ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులు చేపడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం 15 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు వైప్లస్ భద్రత కల్పించింది. మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న క్రమంలో శివసేన నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది.
ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిండే వర్గం సోమవారం పేర్కొంది. డిప్యూటీ స్పీకర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించింది. మరోవైపు రాజ్ ఠాక్రేతో అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది.