షిండే సహా 12 మంది రెబల్స్పై అనర్హత వేటుకు శివసేన సిఫార్సు
మరికొందరి రెబల్స్ పేర్లూ పరిశీలన
ఎంవీఏ నుంచి బయటకువచ్చేందుకు సిద్ధమేనని అంతకుముందు ప్రతిపాదన
రెబల్స్ దిగిరాకపోవడంతో అనర్హత అస్త్రం
ఠాక్రే వెంటే ఉంటామన్న కాంగ్రెస్, ఎన్సీపీ
ముంబై, జూన్ 23: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి తిరిగి వస్తే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నా.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపోవడంతో శివసేన చివరిగా అనర్హత అస్త్రం ప్రయోగించింది. తిరుగుబాటు నేత ఏక్నాథ్షిండేతో సహా 12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ను కోరింది. మరికొందరి రెబల్స్ పేర్లనూ పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఈ నెల 18న సమావేశానికి పిలిచాం. సునీల్ప్రభు విప్ జారీచేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో తెలుపాలని నోటీసులు ఇచ్చాం. కొంతమంది వివరణ ఇచ్చారు. అవి నిజమో కాదో తెలీదు. దీంతో అనర్హతకు సిఫారసు చేశాం’ అని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. అనర్హత అంశంపై షిండే స్పందించారు. అసెంబ్లీ కార్యకలాపాలకే విప్ వర్తిస్తుందని, సమావేశాలకు వర్తించదని పేర్కొన్నారు. తమకూ చట్టం తెలుసన్నారు. మరోవైపు, తాము ఉద్ధవ్ వెంటే ఉంటామని, ప్రభుత్వం కూలిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తామని కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. మెజార్టీ అసెంబ్లీలోనే తేలుతుందని, బయట కాదని పేర్కొన్నాయి. బలపరీక్షలో ఎంవీఏ నెగ్గుతుందని ఎన్సీపీ అధినేత పవార్ పేర్కొన్నారు.
కూటమి నుంచి బయటకువచ్చేందుకు సిద్ధమే
అంతకుముందు పార్టీలో చీలిక రాకుండా రెబల్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం చివరి ప్రయత్నం చేశారు. 24 గంటల్లో అసమ్మతి ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి వస్తే.. ఎంవీఏ నుంచి శివసేన బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ‘మేం శివసైనికులం అని చెబుతున్నారు. పార్టీని వీడబోమంటున్నారు. హిందూత్వ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. మీకు ప్రభుత్వంతోనే సమస్యలు ఉన్నాయంటున్నారు. శివసేన ఎంవీఏ నుంచి బయటకు రావాలని మీరంతా నిజంగా కోరుకుంటే, 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి వచ్చే ధైర్యం చేయండి. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించండి. మీ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటాం. ట్విట్టర్, వాట్సాప్లో మాత్రం లేఖలు రాయకండి’ అని రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే నాయకత్వంలో 47 మంది (37 మంది శివసేన, 10 మంది స్వతంత్రులు) ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటిలో ఉన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా నిర్వహించిన సమావేశానికి ఆదిత్య ఠాక్రే సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.
మా వెనుక జాతీయపార్టీ: షిండే
మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై బుధవారం ఉద్ధవ్ మాట్లాడుతూ.. సీఎం పదవి తనకు తృణప్రాయమని, రాజీనామా లేఖ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. అనంతరం అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. దీనిపై అసమ్మతి నేత షిండే గురువారం కౌంటర్ ఇచ్చారు. ఎంవీఏ పాలనలో తన వర్గం ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ఎన్సీపీ, కాంగ్రెస్కు ఠాక్రే ప్రాధాన్యం ఇచ్చారని, తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ మేరకు అసమ్మతి ఎమ్మెల్యేలు రాసిన లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు. తమకు అన్ని విధాలుగా సాయం చేస్తామంటూ జాతీయ పార్టీ ఒకటి హామీ ఇచ్చిందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు.
విశ్వాస పరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటాం
మహా సంక్షోభంలో బీజేపీ పాత్ర ఉందని తాను అనుకోవడం లేదని ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంవీఏ ప్రభుత్వం కూలిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని, సీఎం ఉద్ధవ్కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందించారు. మహారాష్ట్ర వెలుపల ఉన్న బీజేపీ నాయకులపై అజిత్కు సరైన అవగాహన లేదన్నారు. అందుకే, ఈ సంక్షోభంలో బీజేపీ పాత్ర లేదంటూ అజిత్ వ్యాఖ్యానించారని తెలిపారు. బీజేపీని ఉద్దేశించే షిండే తనకు జాతీయ పార్టీ మద్దతు ఉందని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఎంవీఏ ప్రభుత్వ భవిష్యత్తు అసెంబ్లీలో జరుగబోయే విశ్వాస పరీక్షతో తెలిసిపోతుందన్నారు. అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకుంటామన్నారు.
బలవంతంగా నిర్బంధించారు: రెబల్ ఎమ్మెల్యే
షిండే క్యాంప్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే వాళ్లను బలవంతంగా అక్కడ నిర్బంధించారని శివసేన ఎమ్మెల్యే కైలాశ్ పాటిల్ గురువారం వెల్లడించారు. సూరత్కు తరలిస్తున్న సమయంలో కారులో నుంచి తాను తప్పించుకున్నట్టు వెల్లడించారు. రెబల్ క్యాంప్లో చేరడానికి మరో ఆరుగురు శివసేన ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గురువారం గువాహటికి ప్రయాణమైనట్టు సమాచారం. ఇందులో మంగళవారం షిండేతో రాయబారం జరిపిన ఎమ్మెల్సీ రవీంద్ర పాఠక్ కూడా ఉన్నారు. మరోవైపు షిండే క్యాంపులో 14 మంది శివసేన ఎంపీలు చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.