పార్సిల్ సేవలతోనూ పైసలు ఫుల్
ఈ యేడాది రూ.1.36 కోట్లు
ఆదిలాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సర్కారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఏండ్లుగా ప్రజారవాణాకే పరిమితమైన ఆర్టీసీ.. గతేడాది కార్గో, పార్సిల్ సేవలను ప్రారంభించింది. ప్రైవేట్ కంటే తక్కువ ధర, వేగంగా, సులభంగా, బాధ్యతగా, మెరుగైన సేవలు అందిస్తుండడంతో ఆదాయం భారీగా సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా రూ.1.36 కోట్ల ఆదాయం గడించింది. ప్రైవేట్లో రెండు, మూడు రోజులకు అందే సేవలు.. కార్గో ద్వారా 24 గంటల్లోనే అందుతుండడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీకి కార్గో, పార్సిల్ సేవల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఆర్టీసీ నష్టాల్లో ఉండడంతో, ప్రభుత్వం దాన్ని గట్టెక్కించేందుకు గతేడాది జూన్ మాసంలో ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తం గా 19 సర్వీసులను ప్రారంభించింది. వీటితోపాటు 38 మంది ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. వీటి ద్వారా రోజుకూ సుమారు 500 పా ర్సిళ్లు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుంటాయి. ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని యావత్మల్, నాందేడ్, కిన్వట్, పాండ్రకవడ, చంద్రాపూర్కు కూడా కార్గో సేవలు అందుతున్నా యి. దీంతో రోజుకూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. ఆదిలాబాద్, ఉట్నూ రు డిపోల పరిధిలో 12 వాహనాలు, ఆసిఫాబాద్ డిపో పరిధిలో నాలుగు, నిర్మల్ డిపో పరిధిలో రెండు, మంచిర్యాల డిపో పరిధిలో ఒక వాహనం నడుస్తున్నాయి. ఆదిలాబాద్, ఉట్నూరు పరిధిలో రోజుకు 195 పార్సిళ్లు, ఆసిఫాబాద్ 75, మంచిర్యాల పరిధిలో 120, నిర్మల్ పరిధిలో 110 వరకు బుక్ అవుతున్నాయని అధికారులు తెలిపారు.
కొన్ని రూట్లకు ప్రత్యేక వాహనాలు
ఎనిమిది టన్నుల బరువున్న పార్సిళ్లు ఉంటే ఆ రూట్లో ప్రత్యేకంగా వాహనం పంపిస్తున్నారు. ఆర్మూరు, అంకాపూర్ ప్రాంతం నుంచి ఆర్టీసీ కార్గో సేవల ద్వారా అంకాపూర్ దేశీ చికెన్ పార్సిళ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తెప్పించుకుంటున్నారు. జిల్లాలోని వ్యాపారులు కూడా కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ పార్సిల్ సేవలతో పోల్చితే కార్గో సేవల ధరలు తక్కువగా ఉండడం, వేగంగా, బాధ్యతగా, సేవలు అందుతుండడంతో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ప్రైవేట్ రవాణా సంస్థల ద్వారా సరుకులను తరలిస్తే బీమా సౌకర్యం ఉండదు. కానీ.. ఆర్టీసీ కార్గో సర్వీసులలో రూ.5 ఎక్కువగా చెల్లిస్తే ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తిస్తుంది. కొరియర్ సర్వీస్లో సరుకులు, వస్తువులు గమ్యం చేరాలంటే మూడు రోజుల సమయం పడుతుంది. అదే కార్గో సర్వీస్ ద్వారా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా 24 గంటల్లోనే సరుకులు చేరుతుండడంతో విశేష ఆదరణ లభిస్తున్నది.
ఏడాదిలో రూ.1.36 కోట్ల ఆదాయం
ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఈ యేడాది 1,59,785 పార్సిళ్లు బుక్ కాగా.. రూ.1,36,19,859 ఆదాయం సమకూరింది. వివిధ సరుకులను 149 ట్రిప్పుల ద్వారా చేరవేయడం వేయగా రూ.7,09,163 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో 34,677 పార్సిళ్లు బుక్ కాగా.. రూ.28,58,820, ఉట్నూర్ డిపోలో 2,902 బుక్ కాగా రూ.1,76,660, నిర్మల్ డిపో పరిధిలో 31,389 బుక్ కాగా..రూ.23,56,537, భైంసా డిపోలో 9,750 బుకింగ్స్కూ రూ.9,83,048, ఆసిఫాబాద్ డిపో పరిధిలో 21,148 బుకింగ్స్కూ రూ.17,18,328, మం చిర్యాల డిపో పరిధిలో 59,919 బుకింగ్స్కు రూ.55,26, 466 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన 4,17,495 పార్సిల్స్ను అందజేశారు. ఆర్టీసీ ద్వారా అందుతున్న పార్సిల్ సేవలు నమ్మకంగా ఉండడంతో ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. విలువైన వస్తువులను కూడా బాధ్యతగా సిబ్బంది వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. వస్తువుల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. పార్సిల్లో వచ్చే గ్లాస్, ఇతర వస్తువులను పగలకుండా చూసుకుంటున్నారు. సిబ్బంది ఎంతో మార్యాదగా మాట్లాడుతూ నమ్మకం కలిగిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో పార్సిల్ వచ్చింది
మా కుటుంబానికి మైక్రోవేర్ (ఆహార పదార్థాలు వేడిచేసే మిష న్) అవసరమైంది. అవి మంచిర్యాలలో తక్కువ ధరకు, నాణ్యతగా దొ రుకుతాయని తెలుసుకున్నా. ఆన్లైన్లో డబ్బులు చెల్లించాను. 24 గంటల్లోపే పార్సిల్ మా కు వచ్చిం ది. కేవలం రూ.130 చార్జీతోనే మైక్రోవేర్ ఎ లాం టి డ్యామేజీ లేకుండా రావడం బాగుంది.
ప్రైవేట్కంటే వేగంగా..
ఇది వరకు ప్రైవేట్ కొరియర్ల ద్వారా పార్సిళ్లు తెప్పించుకున్నాం. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించిన ప్పటి నుంచి వినియోగించుకుంటు న్నాం. గురువారం నేను నిర్మల్ నుంచి వచ్చిన వాషింగ్ మిషన్ను తీసుకున్నా. 3 గంటల్లోపే ఆదిలాబా ద్కు చేరింది. ఇదే పైవేట్ పార్సిల్ అయితే ఒక రోజు పట్టేది. చార్జీ కూడా ఎక్కువగా ఉండేది.
మెరుగైన సేవలు అందిస్తున్నాం
ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజలకు నమ్మకమైన కార్గో, పార్సిల్ సేవలు అందుతున్నాయి. యేడాది కాలం గా పార్సిల్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. వేగంగా, నమ్మకంగా, కచ్చితత్వంలో ఆర్టీసీ సేవలు అందుతుండడం, ప్రైవేట్ కంటే ధరలు తక్కువగా ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.