పుణే : విపక్ష ఇండియా కూటమి తదుపరి కార్యాచరణ త్వరలో ఖరారవుతుందని ఎన్సీపీ వ్యవస్ధాపకులు శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, 2024 లోక్సభ ఎన్నికల అనంతరం ఈ మార్పు కనిపిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ చీలిక వ్యవహారానికి సంబంధించి ఈనెల 6న ఢిల్లీలో జరిగే ఈసీ విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఎన్సీపీ వ్యవస్ధాపకులు ఎవరన్నది అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ జులై 2న నిట్టనిలువునా చీలిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరారు. వీరిలో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలంటూ ఇరువర్గాలూ ఈసీని ఆశ్రయించాయి.
ఎన్సీపీ ఎవరిదనేది అందరికీ తెలుసని, కొందరి అభిప్రాయం వేరుగా ఉన్నా ప్రజాస్వామ్యంలో వారికి ఆ హక్కు ఉంటుందని, దీనిపై తాను వ్యాఖ్యానించనని పవార్ పేర్కొన్నారు. బీజేపీతో చేతులు కలిపిన వారికి ఎన్సీపీలో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ తరహాలో రాజీపడటాన్ని తాము ఆమోదించబోమని ఆయన స్పష్టం చేశారు.
Read More :
Gas Cylinder Price | కేంద్రం భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంపు