ముంబై, సెప్టెంబర్ 20: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రావాలని లేదా కనీసం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను పంపించాలని లేఖ రాసిన రైతు సంస్థ అధ్యక్షుడు పదవిని కోల్పోయారు. వసంతరావు నాయిక్ సేద్య స్వావలంబన్ మిషన్ (వీఎన్ఎస్ఎస్ఎం) అధ్యక్షుడు కిశోర్ తివారీని మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా తొలగించింది. కారణం చెప్పనప్పటికీ ఆయన ప్రధానికి లేఖ రాసిన గంట లోపే బర్తరఫ్ చేయడం గమనార్హం.
సహాయమంత్రి హోదాతో తివారీని గతంలోని ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించింది. 42 సంవత్సరాల దశరథ్ ఎల్ కేదారి అనే పుణే జిల్లా రైతు తన ఆత్మహత్య లేఖలో మోదీ సర్కారు మద్దతు ధర ఇవ్వకపోవడంపై తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. మద్దతుధర లేకపోవడం వల్ల తాను అనుభవించిన కష్టాలను ఏకరువు పెట్టాడు. వ్యవసాయ రంగ నిర్వహణ మోదీ వల్ల కావడం లేదని అక్షింతలు వేశాడు. మోదీ పుట్టిన రోజున, అదీ శుభాకాంక్షలు చెప్పి మరీ ప్రాణాలు తీసుకున్న రైతు ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. మీడియా ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించింది.
ఈ నేపథ్యంలో తివారీ రాసిన లేఖ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. మోదీ స్వయంగా వచ్చి రైతు కుటుంబాన్ని ఓదార్చాలని, లేదా పుణే పర్యటనకు రానున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను అయినా రైతు కుటుంబ పరామర్శకు పంపించాలని సూచించడం కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మింగుడు పడలేదన్నది బహిరంగ సత్యమే. 2015 ఆగస్టులో పదవి చేపట్టిన వ్యవసాయ స్వావలంబన్ మిషన్ చీఫ్గా తివారీ నియమాకం రద్దు చేసినట్టు ప్రభుత్వం ముక్తసరిగా ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి కారణాలు తెలుపకుండా ఏకవాక్యంతో సరిపెట్టింది.
ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో రైతు ఆత్మహత్యపై ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని విపక్ష నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తూర్పార బట్టింది. ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎంచుకుంటే మంచిదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అక్షింతలు వేశారు. ఏ అంశాలపై పండుగలు జరుపుకోవాలో, దేనిని లోతుగా పరికించాలో అందలాలు ఎక్కినవారు తేల్చుకోవాలని పవార్ అన్నారు. సీఎం గణేశ్ మంటపాలను సందర్శించడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతులు నిస్పృహకు గురికావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తాపసే దుయ్యబట్టారు. మోదీ సర్కారు విధానాలను తీవ్రంగా ఖండించారు.
ప్రతీ గంటకు ఒక రైతు బలి : కాంగ్రెస్
దీ సర్కార్ వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ప్రతీ గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకొంటున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యలకు బీజేపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా 2021లో 10,881 మంది వ్యవసాయ పనులు చేసేవారు (రైతులు, కూలీలు, కౌలుదారులు) ఆత్మహత్య చేసుకొన్నారని తెలిపింది.