తమిళనాడులో ఎన్నికల తర్వాత కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కలిసి పోటీ చేసిన కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తున్నాయి. ఒక కూటమి పార్టీ మరో కూటమి పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికార టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించారు.
అప్పట్లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిశారు. అలాగే, మంత్రి ఆధవ్ అర్జునను కూడా కలిశారని తెలుస్తోంది. వీరంతా సీఎం విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే వీరు ఏఐఏడీఎంకేకు రాజీనామా చేశారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన కే మరగతం కుమారవేల్.. టీవీకే అభ్యర్థిపై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో ఎమ్మెల్యే ఎస్ జయకుమార్ డీఎంకే అభ్యర్థిపై గెలిచారు. మరో ఎమ్మెల్యే సత్యభామ డీఎంకే అభ్యర్థిపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు అనుకూలంగా ఓటు వేశారు.
దీంతో వీరంతా టీవీకేలో చేరుతారని ప్రచారం జరిగింది. ఒకవేళ వీరంతా టీవీకేలో చేరితే ఆ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగుతుంది. ఏఐఏడీఎంకే రెబల్ నేతలకు ఎస్పీ వేలుమణి, షణ్ముగంలు నాయకత్వం వహిస్తున్నారు. వీరు పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పళనిస్వామిని పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.