నల్లగొండ, ఏప్రిల్ 19 : మొదటి వేవ్లో ఎందరినో ఇబ్బందుల పాలు చేయడంతో పాటు మరెందరివో ప్రాణాలు తీసిన మహమ్మారి కరోనా. ఆ తర్వాత ఐదారు నెలలుగా తగ్గినట్లు కనిపించినా తిరిగి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. కానీ ప్రజలు వాటిని పాటించక పోవడంతో కొవిడ్ వైరస్ మరోసారి విలయతాండవానికి సిద్ధమైంది. జిల్లాలో రోజుకు 140 నుంచి 146 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. వచ్చే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా సెకండ్ వేవ్ జిల్లాలో క్రమంగా విస్తరిస్తున్నది. నాలుగైదు నెలలుగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ టెస్ట్లు చేస్తున్నారు. రోజుకు 140 నుంచి 160 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 16న జిల్లాలో 116 కేసులు కాగా, 17న 168, 18న 139 కేసులు వచ్చాయి.
నాకేమైతదిలే అనే నిర్లక్ష్యం..
కరోనా ఫస్ట్వ్లో ఎంతో మందికి పాజిటివ్ రాగా అందులో మరికొందరు మృత్యు వాత పడ్డారు. ఎక్కువ మంది కోలుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నావారు, వృద్ధులు ఎక్కువగా మహమ్మారికి బలయ్యారు. అయితే మొదటి దశలో కోలుకున్న వారు ఇక తమకు ఏమీ కాదులే అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైరస్ విజృంభిస్తున్నది. ఈ సారి ఎక్కువగా 20 నుంచి 40 ఏండ్ల వయసున్న వారిలో కనిపిస్తున్నది. అయితే వీరిలో అంతగా లక్షణాలు లేకపోయినా వారి వల్ల ఇతరులకు వేగంగా వ్యాపిస్తున్నది. అందుకే వారం రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
నిబంధనలు పట్టవు
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పక పెట్టుకోవాలని, లేకపోతే రూ. రూ.1000 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎవ్వరూ అంతగా కేర్ చేయడం లేదు. గాలిలో వైరస్ వ్యాపిస్తుందని, పాజిటివ్ ఉన్న వ్యక్తి చుట్టూ మూడు మీటర్ల దూరం వరకు దాని వ్యాప్తి ఉంటుందని, దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, గట్టిగా అరిచినా వైరస్ గాల్లోకి చేరి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది మాస్క్లు ధరించకుండా తిరుగుతున్నారు. ముఖ్యంగా యువత అధికంగా నిర్లక్ష్యంగా ఉంటూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉంది.
మాస్కులు ధరించకుంటే ముప్పే
కరోనా సెకండ్ వేవ్ గతానికంటే వేగంగా విస్తరిస్తున్నది. జనాలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నిర్లక్ష్యం సరికాదు. వారంలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వచ్చే నాలుగైదు వారాల్లో ఇంకా విస్తరించే అవకాశం ఉన్నది. అందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాల్సిందే. లేదంటే ప్రమాదంలో పడటంతో పాటు ఇతరుల ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి.
-కొండల్ రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ