Delhi : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న దంపతుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అరెస్టైన జంటను మొహమ్మద్ సాహిల్, అతడి భార్య సమీరగా గుర్తించారు. వీరి అరెస్టుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. సాహిల్, సమీర జంట ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో ఉంటున్నారు. సాహిల్ 2001లో ఉత్తర ప్రదేశ్లోని బదాయున్ ప్రాంతానికి చెందినవాడు.
అతడు త్వరలో ఎల్ఎల్బీ చదివేందుకు ప్లాన్ చేసుకున్నాడు. 2005లో బిజ్నూర్కు చెందిన సమీర ఇంటర్ పూర్తి చేసింది. వీరిద్దరూ కొంతకాలంగా పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) సంస్థతో కలిసి పని చేస్తున్నారు. భారతీయ నిఘా వ్యవస్తలు అందించిన సమాచారం ఆధారంగా నార్తర్న్ రేంజ్ ఆఫ్ ద స్పెషల్ సెల్ పోలీసులు ఈ దంపతుల్ని అరెస్టు చేశారు. సాహిల్ 2024 నుంచి పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్కడి వారిని సంప్రదిస్తుంటాడు.
అతడితోపాటు భార్య సమీర కూడా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తుంటుంది. ఈ ఇద్దరికీ తగిన ఆర్థిక సాయం అందిస్తామని పాక్ ఏజెంట్లు హామీ ఇవ్వడంతో ఇద్దరూ గూఢచర్యం చేస్తున్నారు. పాక్ వారికి అనుకూలంగా ఉండేవారిని ఇంకా సభ్యులుగా చేర్పించడం, అలాగే వారికి రవాణ సదుపాయం చేయడం వంటి పనుల్ని పాక్ ఐఎస్ఐ అప్పగించింది. ఈ జంట ఇక్కడ ఎనిమిది సిమ్ కార్డులు కొని, దుబాయ్ ద్వారా పాకిస్తాన్ పంపింది. ఈ సిమ్ కార్డులకుగాను వారికి రూ.30,000 అందాయి. ఈ ఇండియా నెంబర్లను పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
వీటికి సంబంధించిన వాట్సాప్ కూడా యాక్టివేట్ అయింది. ఈ నెంబర్ల ద్వారా నిఘా సంబంధిత కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇండియన్ నెంబర్లతో పాకిస్తాన్ వాళ్లు అనేక ఇండియన్ వాట్సాప్ గ్రూపుల్లోకి ఎంటర్ అయ్యారు. ఇండియాలోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఈ జంట పర్యటించి, అక్కడి సమాచారాన్ని కూడా వారికి చేరవేసింది. ఈ దంపతులకు సంబంధించిన ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.