ఊరూరా డంప్యార్డులు
ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్త సేకరణ
నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
అద్దంలా గ్రామ పంచాయతీలు
మంచిర్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలే మారిపోయాయి. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాడు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారంతో దర్శనమిచ్చిన వీధులు, నేడు అద్దంలా మెరుస్తున్నాయి. ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తను సేకరిస్తూ డంప్ యార్డులకు తరలిస్తుండగా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల రూపురేఖలను మార్చింది. మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి చోటా రూ.2.5 లక్షలతో షెడ్లను నిర్మించారు. కంపోస్టు ఎరువుల ప్రారంభానికి, వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. పట్టణాల మాదిరిగా గ్రామాల్లోనూ చెత్తసేకరణ నిరంతరాయంగా జరుగుతున్నది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికులకు సర్కారు వేతనాన్ని కూడా పెంచింది. చెత్తను సేకరించేందుకు పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్ను కూడా సమకూర్చింది. డ్రైనేజీల నుంచి తీసిన మట్టి, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ట్రాలీ ద్వారా పంచాయతీ సిబ్బంది తరలిస్తున్నారు. చెత్తను మొత్తం ఒకచోట వేసేందుకు ప్రతి గ్రామం శివారుల్లో డంప్యార్డును ఏర్పాటు చేశారు. యార్డుల కోసం అన్ని జీపీల్లోనూ స్థలాలను ఎంపిక చేసి నిర్మించారు. ఊళ్లలోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీలోని ట్రాక్టర్, ట్రాలీల ద్వారా డంప్ యార్డుకు తరలిస్తున్నారు. రోజూ పల్లె, పట్టణాల్లో పారిశుధ్యకార్మికులు ఉదయమే చెత్తాచెదారాన్ని తొలగించడం, మురుగు కాలువలు శుభ్రం చేస్తుండడంతో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. డ్రైనేజీల నిర్మాణంతో మురుగు నీరు రోడ్లపైకి రాకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
అధికారుల నిరంతర పర్యవేక్షణ
పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులను యాప్లో నమోదు చేస్తుంటారు. వీటిని మండల స్థాయిలో ఎంపీడీవోలు, డివిజన్ స్థాయిలో డీఎల్పీవోలు, జిల్లా స్థాయిలో డీపీవోలు పర్యవేక్షిస్తుంటారు. సంబంధిత యాప్లో రోజువారీ పనులను నమోదు చేస్తుంటారు. గ్రామాల్లో నిర్వహించిన పారిశుధ్య నిర్వహణ పనులు, ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడం, వీధి దీపాల నిర్వహణ, ఇండ్ల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లడం, పంచాయతీ ఆదాయ, వ్యయాలను, చెక్కులు, వేతనాల రసీదులను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేస్తుంటారు.