లక్నో : యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఖురేషిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. రాంపూర్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేత సక్సేనా ఖురేషిపై ఫిర్యాదు చేశారు.
వివిధ వార్తా చానెళ్లలో ప్రసారమైన ఖురేషి వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ను సక్సేనా పోలీసులకు అందించారు. యోగి సర్కార్ను రక్తం తాగే రాక్షసుడి ప్రభుత్వంగా ఖురేషి అభివర్ణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ నేత ఆజం ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య తజీన్ ఫత్మాతో సమావేశానంతరం ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసి సమాజంలో అఃశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.