2023 Year Ender | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఘర్షణలు, ఒడిశా ఘోర రైలు దుర్ఘటన, రెజ్లర్ల ఆందోళన.. వంటివి దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక పరిణామాలేంటో చూద్దాం..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత మే నెలలో చెలరేగిన ఘర్షణలు యావత్ దేశాన్ని కలవరపరిచాయి. మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు, మైతీల మధ్య చిచ్చు రేగింది. రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంట్ను కూడా ఈ అంశం కుదిపేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని ఈ ఏడాది పరువు నష్టం కేసులు వెంటాడాయి. ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. పరువునష్టం (క్రిమినల్) కేసులో సూరత్ కోర్టు రాహుల్గాంధీని దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్రం తీరుపై కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు మండిపడ్డాయి. న్యాయం కోసం రాహుల్గాంధీ సుపీ్రంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. దిగువ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు నిలుపుదల చేయగా, ఐదు నెలల తర్వాత రాహుల్గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన భారత నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ద్రవిడ సాంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్టాపన చేశారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులున్న కొత్త పార్లమెంట్ భవనం శీతాకాలం సమావేశాలతో అందుబాటులోకి వచ్చింది.
ఒడిశాలోని బాలేశ్వర్లో జూన్ 2 రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్పూర్-హావ్డా ఎక్స్ప్రెస్ రైళ్లు అనూహ్యంగా ఢీకొనటం దేశమంతా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై మరొకటి దూసుకెళ్లటం, వాటి మధ్య ఛిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఘటనాస్థలానికి సమీపంలోని గ్రామ ప్రజలు చూపిన మానవత్వం అందర్నీ కదిలించింది. గాయపడ్డవారికి వందలాది మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
న్యూఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన సెప్టెంబర్లో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు.. నినాదంతో సభ్యదేశాలతోపాటు, మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ‘ఢిల్లీ డిక్లేరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావటంలో భారత్ కీలక ప్రాత పోషించింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యాకు భారత్ మద్దతుగా ఉండటంతో, సదస్సు నిర్వహణ సవాల్గా మారింది. ప్రతిష్టాత్మకమైన భారత్-మధ్య ఆసియా-తూర్పు ఐరోపా ఆర్థిక నడవా విషయంలో సదస్సులో అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం పాక్షికంగా కుప్పకూలటంతో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ కలవరపాటుకు గురిచేసింది. లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన టన్నెల్ ఆపరేషన్కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యలను దాటి, 17 రోజులపాటు అలుపెరగక శ్రమించిన విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రయత్నాలు ఫలించి కార్మికులంతా సురక్షితంగా బయటపడ్దారు. శిథిలాల తవ్వకంలో బాహుబలి లాంటి భారీ యంత్రం దెబ్బతినగా, కొద్ది మంది ‘ర్యాట్ హోల్ మైనర్ల’తో చేపట్టిన తవ్వకం గమ్యాన్ని చేరుకుంది.
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు లోక్సభలోకి దూసుకొచ్చి.. రంగులు వెదజల్లుతూ, నినాదాలు చేయటం తీవ్ర కలకలం రేపింది. ఇదే సమయంలో పార్లమెంట్ బయట మరో ఇద్దరు దుండగులు అదే తరహాలో ఆందోళనలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పరుస్తున్నారని సభాపతులు మొత్తం 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించటం చర్చనీయాంశమైంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా కూటమి’గా ఏర్పడ్డాయి. అయితే లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రెండు చోట్లా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు రాజ్యాంగ ధర్మాసనం నిరాకరించింది.
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయటం సంచలనం రేపింది. ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ తదితర రెజ్లర్లు జనవరి నెలలో ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. దీంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. డబ్ల్యూఎఫ్ఐపై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. తమ నిరసనను కేంద్రం పట్టించుకోవటం లేదన్న ఆవేదనతో రెజ్లర్లు తమ అవార్డులను వెనక్కి ఇచ్చారు.