PM Modi | అహ్మదాబాద్/న్యూఢిల్లీ, మార్చి 31: విద్య.. మనిషి జ్ఞానానికి, సంస్కారానికి ఆధారం. విద్య.. ఏ వ్యక్తి అయినా గర్వంగా, గొప్పగా చెప్పుకోగలిగే ఆస్తి. ఎంతోమంది ఉన్నత విద్యలో తాము సాధించిన పట్టాల వివరాలను పేర్ల వెనుక గొప్పగా రాసుకొంటారు. తెలుగు సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు తన పేరు కింద ‘బీఏ’ అని రాసుకో వటం ఆయన సినిమాలు చూసినవాళ్లందరికీ గుర్తే.. కానీ, మన దేశంలో బహుశా ఒకేఒక వ్యక్తి తాను అభ్య సించిన విద్య వివరాలు బయటకు రాకుండా విశ్వప్ర యత్నాలు చేస్తున్నారు. ఆయనే మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. విశ్వ గురువుగా బీజేపీ నేతలు బాకాలు ఊదుతున్న వ్యక్తి.. తన విద్య వివరాలను సొంత దేశ ప్రజలే తెలుసుకోకూడదనుకోవటం విడ్డూరం. తాను ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ వర్సిటీ నుంచి ఎంఏ రాజనీతి శాస్త్రం చదివానని మోదీ తన ఎన్నికల అఫిడవిట్లలో చెప్పుకొన్నారు. కొందరికి అనుమానం వచ్చి ఆ వివరాలు ఇవ్వాలని ఆయా వర్సిటీలను అడిగితే చల్.. మోదీగారి వివరాలు అడుగుతారా? అని మండిపడ్డాయి. సాక్షాత్తూ కేంద్ర సమాచార కమిషన్ కూడా మోదీ విద్యా వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తే.. ఇచ్చేదేలే.. అంటూ కోర్టుకు వెళ్లాయి. తాజాగా గుజరాత్ హైకోర్టు కూడా వర్సిటీల వాదనకే కట్టుబడి.. వివరాలు అడిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కే రూ.25 వేల జరిమానా విధించటం కొసమెరుపు.
మోదీ డిగ్రీల వివరాలు వెల్లడించాలని ఏడేండ్ల క్రితం గుజరాత్ వర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సైతం హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని విద్యార్హతల సమాచారాన్ని కోరుతూ 2016 ఏప్రిల్లో అప్పటి కేంద్ర సమాచార కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులకు కేజ్రీవాల్ లేఖ రాశారు. స్పందించిన ఆయన.. మోదీ డిగ్రీలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్కు ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించారు. ఈ ఆదేశాలను గుజరాత్ వర్సిటీ హైకోర్టులో సవాల్ చేయగా అప్పుడే కోర్టు స్టే ఇచ్చింది. గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిరేన్ వైష్ణవ్.. సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడంతోపాటు కేజ్రీవాల్కు జరిమానా విధించారు.
హైకోర్టు తీర్పుపై స్పందించిన కేజ్రీవాల్.. ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకొనే హక్కు కూడా దేశానికి లేదా? అని ప్రశ్నించారు. తన డిగ్రీని చూపించేందుకు ప్రధాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. నిరక్షరాస్యుడైన, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరమని ట్వీట్ చేశారు.
‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో బిజినెస్లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఆయన వెల్లడించారు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను పబ్లిక్గా షేర్ చేయొచ్చా! అని నెటిజన్లను అడుగుతూ ట్వీట్ చేశారు. మోదీ విద్యార్హతల సర్టిఫికెట్లను చూపెట్టాల్సిన అవసరమేమీ లేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తున్నది.