భోపాల్ : జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పొట్టివాడైనా అహంకారి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత సింధియా దీటుగా బదులిచ్చారు. పొడవైన నేతలకు యూపీలో కేవలం ఒక సీటే వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎవరికైనా తనపై కసి ఉంటే అందుకు తానేం చేయలేనని, కొందరు తమను తాము గొప్ప నేతలుగా ఊహించుకుంటారని, వారు యూపీలోని 80 సీట్లలో కేవలం ఒక సీటుతోనే సర్దుకున్నారని సింధియా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ప్రియాంక వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఆమె పట్ల తనకు ఎలాంటి ద్వేషం లేదని, ప్రియాంక వ్యాఖ్యలకు తాను బదులిచ్చానని జ్యోతిరాదిత్య సింధియా చెప్పుకొచ్చారు. తనకు ఎవరి పట్ల ద్వేషం లేదని, వాటిపై తనకు నమ్మకం కూడా లేదని ప్రజలకు మంచి చేసేందుకు వారి ప్రేమ, విశ్వాసం చూరగొనేందుకు భగవంతుడు మనకు చాలా తక్కువ సమయం ఇచ్చాడని అన్నారు.
పురోగతి, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు తమ పట్ల విశ్వాసం కనబరుస్తారని భావిస్తున్నామని అన్నారు. మరోవైపు ప్రియాంక వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆమె అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
Read More :