న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా కూల్చివేతలు కొనసాగించడాన్ని ఆక్షేపించింది. ‘సుప్రీంకోర్టు ఆదేశాలను మేయర్కు తెలిపి న తర్వాత జరిగిన అన్ని కూల్చివేతలను తీవ్రంగా పరిగణిస్తాం’ అని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయితో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
జహంగీర్పురిలో హనుమాన్ శోభాయాత్రలో అల్లర్లకు పాల్పడిన నిందితులు నివసిస్తున్న ఇండ్లు అక్రమమని, వాటిని కూల్చివేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ మేయర్ ఇక్బాల్ సింగ్కు లేఖ రాశారు. ఈ క్రమంలో బుధవారం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ను ప్రారంభించారు. కలుగజేసుకొన్న సుప్రీంకోర్టు డ్రైవ్ను వెంటనే నిలిపేయాల్సిందిగా ఆదేశించింది. రాతపూర్వక ఉత్తర్వులు అందలేదన్న సాకుతో అధికారులు కూల్చేవేతలను 2 గంటలపాటు కొనసాగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వెంటనే కూల్చివేతలు నిలిపేయాలంటూ మళ్లీ ఆదేశించింది. దీంతో చేసేదేమీలేక అధికారులు కూల్చివేత డ్రైవ్ నిలిపేశారు.
అందుకు బుల్డోజర్లతో పనేంటి?
విచారణలో భాగంగా పిటిషనర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. పత్రాలు చూపించినా కూల్చివేతలు ఆపలేదని, తమను లక్ష్యంగా చేసుకొన్నారని ఆరోపించారు. అయితే, అధికారులు చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలంగించారని ఎన్డీఎంసీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. చిన్న నిర్మాణాలు తొలగించడానికి బుల్డోజర్ల అవసరమేంటని ప్రశ్నించింది. కూల్చివేతలపై మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసింది. బీజేపీ నేత లేఖ రాయగానే అధికారులు కూల్చివేతలు ఎలా చేపట్టారని జమైత్ ఉలామా ఎ హింద్ తరఫు న్యాయవాది దుష్యంత్ దేవ్ ప్రశ్నించారు. కూల్చివేతల డ్రైవ్ చేపట్టేముందు నోటీసులు ఇవ్వాలని, దీనిపై అప్పీల్ చేసుకొనేందుకు కూడా సమయం ఇవ్వాలని పేర్కొంటూ ఢిల్లీ మునిసిపల్ చట్టాలను గుర్తు చేశారు.
అల్లర్లపై కేంద్రానికి నివేదిక: ఎన్సీఎం
జహంగీర్పురిలో ఇటీవల జరిగిన అల్లర్లకు సంబంధించిన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తామని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్సీఎం) సభ్యురాలు సయ్యద్ షాజాదీ గురువారం తెలిపారు. ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎన్సీఎం చైర్మన్, ఇతర సభ్యులు ఇప్పటికే అల్లర్ల ప్రాంతంలో పర్యటించినట్టు ఆమె పేర్కొన్నారు.