న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతను ఢిల్లీలో కాకుండా కోల్కతాలో ఎందుకు ప్రశ్నించకూడదని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఈడీని నిలదీసింది. ఈడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిషేక్ బెనర్జీని విచారించేలా వారికి తగిన భద్రత కల్పించాలని కోల్కతా పోలీసులను ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అభిషేక్ బెనర్జీ ఆయన భార్య రుజిరా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియతో కూడిన సుప్రీం బెంచ్ విచారిస్తోంది.
పశ్చిమ బెంగాల్ కోల్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ అభిషేక్ దంపతుల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద పోలీసులు సాక్షులను వారి ప్రదేశాల్లోనే విచారించాలని అభిషేక్ బెనర్జీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు.
దర్యాప్తు అవసరం లేదని తాము చెప్పడం లేదని, కోల్కతాకు వచ్చి అభిషేక్ బెనర్జీని ప్రశ్నించవచ్చని కానీ దర్యాప్తు అధికారులు ఆయనను ఢిల్లీ రావాలని కోరుతున్నారని కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. గతంలో సీబీఐ అధికారులను కోల్కతాలో ఘొరావ్ చేసిన ఉదంతాలు ఉన్నాయని, అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం కలిగిన రాజకీయ నేత అనే విషయం మరువరాదని ఈడీ తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.