న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్టు మోసం కేసులను పరిష్కరించడంలో బ్యాంకుల వృత్తి నైపుణ్యంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. కస్టమర్లు తమ జీవితకాల పొదుపు మొత్తాలను కోల్పోతున్నప్పటికీ అనుమానాస్పద లావాదేవీలను వెంటనే ఎందుకు అడ్డుకోవడం లేదని బ్యాంకులను సుప్రీంకోర్టు నిలదీసింది. అటువంటి మోసాలను ఎదుర్కొనడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(మీటీ) దాఖలు చేసిన స్థాయీ నివేదికలను కేంద్రం సమర్పించిన సందర్భంగా ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం చేపట్టింది.
కేసులకు సంబంధించిన డాటాను క్రోడీకరించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)ని సిద్ధం చేస్తున్నామని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. కస్టమర్లను రక్షించాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2న రూపొందించిన ఎస్ఓపీని అధికారికంగా స్వీకరించి అమలు చేయాలని, చోరీ అయిన నిధులను పునరుద్ధరించడానికి ఇంటర్-ఏజెన్సీ సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రొసీజర్లను నిర్ధారించాలని హోం శాఖని ఆదేశించింది.