Loksabha Elections 2024 : ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆదివారం ఆరోపించారు. డైరీలో రాసిన అంశాల విషయంలో గోప్యత పాటించాల్సి ఉన్నా ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని ఢిల్లీ పోలీసులు బహిర్గతం చేస్తున్నారని అన్నారు. తొలి రోజు నుంచీ ఢిల్లీ పోలీసులు ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసాల నుంచి ప్రవేశ, నిష్క్రమణల వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ను ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారని మంత్రి వివరించారు. దర్యాప్తు ఏజెన్సీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు ఆరోపించారు.
స్వాతి మలివాల్పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు ప్రదర్శన నిర్వహించే క్రమంలో ఆప్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీకి దీటుగా ఆప్ ఎదగకుండా నిరోధించేందుకు బీజేపీ, ప్రధాని మోదీ కుట్రపూరితంగా ఆపరేషన్ ఝాదూను తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఆప్ బడా నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని, వారిని రాబోయే రోజుల్లో అరెస్ట్ చేయడంతో ఆప్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :