PM Pranam Yojana | న్యూఢిల్లీ, జూన్ 18: రైతు వెన్ను విరిచే మరో దుర్మార్గపు పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో ఫెర్టిలైజర్స్ (సేంద్రియ ఎరువుల) పేరుతో లక్షల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతున్నది. సేంద్రీయ ఎరువుల వాడకం పేరుతో పీఎం ప్రణామ్ పథకాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. వ్యవసాయ నిర్వహణలో ప్రత్యామ్నాయ పోషకాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తీసుకు వస్తున్నామని కేంద్రం చెబుతున్నది. పథకాన్ని ఈ నెలాఖరున లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పథకానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపనుంది.
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని సగానికి తగ్గించే లక్ష్యంతోనే ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రసాయన ఎరువులపై ప్రభుత్వం రూ.2.25 లక్షల కోట్ల సబ్సిడీ అందజేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం, కేంద్ర బడ్జెట్లో పెద్దమొత్తంలో ఎరువుల సబ్సిడీకి ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం వల్ల బడ్జెట్లోని మిగిలిన రంగాలకు కేటాయింపు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ఈ సబ్సిడీని తగ్గించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ నిర్ణయించింది. 50 శాతం సబ్సిడీని కనుక తగ్గించగలిగితే చాలా పెద్దమొత్తంలో నిధులు ఆదా చేయవచ్చని, ఆ నిధులను రాష్ర్టాలలో పలు అభివృద్ధి పనులకు కేటాయించవచ్చని కొత్త పథకానికి తెరతీసింది.
సేంద్రియ ఎరువు అన్నది సూక్ష్మ జీవులను కలిగి ఉండే పదార్థం. దీనిని విత్తనాలు, మొక్కలు, నేలలో ప్రయోగించడం ద్వారా వాటికి సహజ పోషకాలను అందించడమే కాక. త్వరగా వాటి ఎదుగుదలకు తోడ్పడుతుంది. బయో ఎరువులంటే రసాయన ఎరువులు కాదు. రసాయన ఎరువులు నేరుగా భూమి సారాన్ని అధికం చేస్తాయి. అయితే సేంద్రియ ఎరువులు నేరుగా ఆ పని చేయవు. అవి భూమి సారవంతం ప్రక్రియను సహజసిద్ధంగా ప్రకృతి విధానంలో చేస్తుంది.