Waqf (Amendment) Bill 2024 : కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది వక్ఫ్ బోర్డు అధికారాలను నియంత్రిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజలు విరాళంగా ఇచ్చిన భూములను తిరిగి తీసుకునేందుకు మీరెవరని ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ ప్రశ్నించారు.
మొదటి నుంచి ప్రభుత్వ ఉద్దేశం ఇదేనని అన్నారు. బీజేపీ తన పేరును మార్చుకోవాలని, ఆ పార్టీని భారత భూములను లాగేసుకుని వారికి ఇష్టమైన వారికి పంచే పార్టీగా పిలవాలని అన్సారీ వ్యాఖ్యానించారు. ఇక లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. ఈ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే నిబంధనను తీసుకొస్తున్నారని అన్నారు. ఇది మత స్వేచ్ఛపై నేరుగా చేపట్టిన దాడేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపై కాషాయ పాలకులు క్రైస్తవులు, జైనులను కూడా లక్ష్యంగా చేసుకుంటారని ఆరోపించారు.
జేపీసీకి పంపేందుకు కేంద్రం ఓకే
వక్ఫ్ బిల్లుపై విపక్షాల నుంచి తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఓ మతం లక్ష్యంగా దాడి చేసేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్షాలు గొంతెత్తాయి. విపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లుపై ప్రభుత్వం కొద్దిగా వెనక్కితగ్గింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
Read More :