Sam Pitroda | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ మేరకు ఇంగ్లిష్ వార్తాపత్రిక ‘ది స్టేట్స్మన్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
’75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో మనమంతా కలిసి చక్కని వాతావరణంలో జీవిస్తున్నాం. మనది ఎంతో వైవిధ్యమైన దేశం. అక్కడక్కడ చిన్న కొట్లాటలు జరుగుతున్నా.. మనమంతా ఒక్కటే అనే భావనతో కలిసే ఉంటున్నాం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమవాసులు అరబ్బులుగా.. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు. ఎవరెలా ఉన్నా.. మనమంతాసోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం’ అని ఆయన అన్నారు.
వ్యాఖ్యలు దురదృష్టకరం: కాంగ్రెస్
పిట్రోడా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జాతివివక్షను సహించబోయేది లేదన్నారు. శరీర రంగు చూపించి అవమానిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న పార్టీ.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పింది. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
పదవికి రాజీనామా
తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీన్ని ఆమోదించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.