‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దేశ ప్రజల సొత్తును స్వాధీనం చేసుకొంటుందా?’ అంటూ నిన్న మొన్నటివరకూ భయపడ్డాం. అయితే, బీజేపీ సర్కారు అధికారంలో కొనసాగినా మన సొత్తు మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటారా? వారసత్వ పన్ను విధించాలని మోదీ సర్కారు ఏకంగా చట్ట సవరణలకు సిద్ధపడటమే దీనికి కారణం. అంటే.. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. చెమటోడ్చి సంపాదించిన మన సొమ్ముకు గ్యారెంటీ లేదన్న మాట!
Inheritance Tax | హైదరాబాద్, ఏప్రిల్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో 55% వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీల కుటుంబానికి సన్నిహితుడు శామ్ పిట్రోడా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ పన్ను తనకు న్యాయంగానే కనిపిస్తున్నదన్న ఆయన.. అమెరికాలో ఉన్నట్టే భారత్లోనూ ఈ విధానాన్ని తీసుకురావాలన్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఎక్కడ ఎత్తుకుపోతారోనని సామాన్యులు భయపడ్డారు. ఇక, పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘వారసత్వ పన్ను’ను ఇప్పుడు వ్యతిరేకిస్తున్న ప్రధాని మోదీ.. 2017లో గుట్టుచప్పుడు కాకుండా ఈ పన్నును యావత్తు దేశ ప్రజలపై రుద్దాలనుకొన్నారు. ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు.
మరణించిన వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చిన సొమ్ముపై విధించే పన్నును వారసత్వ పన్ను లేదా ఎస్టేట్ పన్నుగా పిలుస్తారు. గతంలో భారత్లోనూ ఈ విధానం ఉండేది. అయితే, ఈ పన్ను ద్వారా ఆర్థిక అసమానతల్లో తగ్గుదల ఏమీ లేదని గ్రహించిన అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం1985లో రద్దు చేసింది. అమెరికా, యూకేల్లో వారసత్వ పన్ను కొనసాగుతున్నట్టే, భారత్లోనూ ఈ తరహా పన్నును విధిస్తే బాగుంటుందని 2017లో మోదీ ప్రభుత్వం యోచించింది. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు, సొమ్ము వారసత్వంగా సంక్రమించినైట్లెతే, ఆ సొత్తును ‘ఇతర మార్గాల ద్వారా లభించిన ఆదాయం’ కింద పరిగణించాలని భావించింది. దీనిపై వారసత్వ పన్ను విధించాలని అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు.
ఈ మేరకు చట్టంలో సవరణలు, ఇతరత్రా మార్గదర్శకాల కోసం మోదీ ప్రభుత్వం విధివిధానాలను కూడా రూపొందించింది. అయితే, సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్ వంటి న్యాయసలహా సంస్థలు, జితేంద్ర సోలంకీ వంటి ఆర్థిక నిపుణులు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్, హక్కుల కార్యకర్తలు, మేధావులు బీజేపీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘వారసత్వ పన్ను’ ఆలోచనను విరమించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో మోదీ సర్కారు ఆ యోచనను విరమించుకొన్నది. కాగా తమ పార్టీ ప్రభుత్వం రద్దు చేసిన ‘వారసత్వ పన్ను’ను తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ఇప్పుడు చెప్పడం చిత్రమైన విషయం. ‘వారసత్వ పన్ను’ను గతంలో రహస్యంగా తీసుకురావాలని యోచించి ఆ తర్వాత భంగపడ్డ బీజేపీ.. ఇప్పుడు అదే అంశంపై అంతెత్తున ఎగురుతుండటం ఇంకా విచిత్ర మనే విమర్శలు పెద్దయెత్తున వస్తున్నాయి.