న్యూఢిల్లీ ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ సర్వోతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పలు విభాగాల్లో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల ప్రతినిధులకు అవార్డులను అందజేసినంత అనంతరం ఆమె ప్రసంగించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మెజారిటీ జనాభా ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారని అన్నారు. నగరాలలో నివసిస్తున్న వారు సైతం గ్రామాలతో అనుసంధానమై ఉన్నారని చెప్పారు. పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుకు మాత్రమే పరిమితం కావొద్దని చెప్పారు. గ్రామాలు నూతన నాయకత్వాన్ని, ప్రణాళికలు, విధాన రూపకర్తలను, ఆవిష్కర్తలను ప్రోత్సహించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఒక గ్రామంలో అమలుచేసిన ఉత్తమ విధానాలను ఇతర గ్రామాలు అనుసరించడం ద్వారా వేగంగా పురోగతి సాధించవచ్చని చెప్పారు. ఏదైనా సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం ప్రాముఖ్యమైనదని రాష్ట్రపతి పేర్కొన్నారు. తమ కోసం, కుటుంబం కోసం, సమాజ హితం కోసం నిర్ణయాలు తీసుకొనే అధికారం మహిళలకు ఉండాలని అన్నారు. గ్రామీణ స్థాయిలో, కుటుంబ స్థాయిలో వారికి సాధికారత కల్పించడం ద్వారా ఆ అధికారం సాకారం కాగాలదని చెప్పారు. దేశంలో స్థానిక సంస్థలకు 31.5 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎంపిక కాగా, వారిలో 46 శాతం మహిళలే కావడం అభినందనీయమని అన్నారు. గ్రామ పంచాయతీల విధులలో మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో కుటుంబాలు మహిళలను ప్రోత్సహించాలని కోరారు.