protect water | సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ క్రమంలో తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీ (housing society) కీలక నిర్ణయం తీసుకుంది. పామ్ మెడోస్ సొసైటీ (Palm Meadows society) తాగునీటిని దుర్వినియోగం చేసిన వారికి భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది. నగరంలోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఈ హౌసింగ్ సొసైటీ ఉంటుంది. నగరంలో నీటి సంక్షోభంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఇదొకటి. దీంతో సొసైటీలో ఎవరైనా నీటిని వేస్ట్ చేస్తే ఏకంగా రూ.5,000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా నియమించింది.
ఈ మేరకు సొసైటీలోని నివాసితులందరికీ నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజులుగా బెంగళూరు నీటి సరఫరా నుంచి నీరు అందలేదని నోటీసుల్లో పేర్కొంది. త్వరలో భూగర్భ జలాలు క్షీణించే ప్రమాదం ఉన్నందున నీటిని ఎవరూ వృథా చేయకండి అని విజ్ఞప్తి చేసింది. గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రతి యూనిట్కు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ‘నివాసుడు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించకపోతే అదనంగా రూ. 5,000 ఛార్జీ ఉంటుంది’ అని నోటీసుల్లో పేర్కొంది. ఉల్లంఘనలకు పాల్పడితే అధిక జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
Also Read..
Death Threat | ప్రధాని మోదీ, యూపీ సీఎంకు హత్య బెదిరింపులు.. కర్ణాటక వ్యక్తిపై కేసు నమోదు
Elon Musk | మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన జెఫ్ బెజోస్