Mouth Freshener | ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురికి ఊహించని అనుభవం ఎదురైంది. డిన్నర్ అనంతరం తీసుకున్న మౌత్ ఫ్రెష్నర్ (Mouth Freshener) కారణంగా వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, నోటి నుంచి రక్తం రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలోని గురుగ్రామ్లో (Gurugram Cafe) చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్ సెక్టార్ 90లోని లాఫోరెస్టా కేఫ్ ( Laforestta Cafe) కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి డిన్నర్ చేశారు. అనంతరం వెయిటర్ ఇచ్చిన మౌత్ఫ్రెష్నర్ను తీసుకున్నారు. అయితే అది తీసుకున్న కొద్దిసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. నోట్లో మంటతో ఇబ్బంది పడ్డారు. అంతే కాకుండా కొందరికి వాంతులు అయ్యాయి. నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది. మంటను తట్టుకోలేక బాధితులు నోట్లో ఐస్ ముక్కలు వేసుకున్నారు. వెంటనే వారంతా ఆసుపత్రిలో చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెష్నర్ ప్యాకెట్ను వైద్యులకు చూపించినట్లు తెలిపారు. అది డ్రై ఐస్ (Dry Ice) అని.. ప్రాణాంతకమైన యాసిడ్ అని వైద్యులు తెలిపినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Elon Musk | మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన జెఫ్ బెజోస్
UP Police Exam: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తొలగింపు