లక్నో: పోలీసు రిక్రూట్మెంట్ (UP Police Exam) పేపర్ లీక్ కేసులో.. యూపీ సర్కార్ చర్యలు తీసుకున్నది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ రేణుకా మిశ్రాను తొలగించారు. ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన పోలీసు పరీక్షను శనివారం రోజున యూపీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పరీక్షను మళ్లీ ఆరు నెలల్లోగా నిర్వహించాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు పరీక్ష నియామకంలో పారదర్శకత లోపించినట్లు ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీక్ వల్ల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రీఎగ్జామ్కు ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్ లీక్ కేసును విచారించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కానిస్టేబుల్ పరీక్ష కోసం సుమారు 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సోషల్ మీడియా లీకైన పేపర్ సర్క్యూలేట్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.