Women’s Reservation Bill | ‘ప్రతీ ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాం’ అంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, అలా జరుగలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. “వో తో చునావీ జుమ్లా థా’ (ఎన్నికల ప్రచారంలో అదో ఫీట్)’ అని తేల్చిపారేశారు.
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా బీజేపీ మరో ‘చునావీ జుమ్లా’నేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే ‘35 ఏండ్ల నిరీక్షణకు శుభం కార్డు పడింది. ప్రజాస్వామ్యంలో భారత నవనారీ శకం మొదలైంది’ అని అందరూ సంబురపడిపోయారు. అయితే, 2026లో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందని, ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్లో వెల్లడించింది. ఎప్పుడో మూడేండ్ల తర్వాత అమల్లోకి వచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ సర్కారు ఇప్పుడు ఎందుకు అంత ఆర్భాటానికి పోతున్నదన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసమే ‘మహిళా బిల్లు’ను ఓ అస్త్రంగా ఆ పార్టీ వాడుకొంటున్నదని, ఎన్నికల తర్వాత ఆ బిల్లు మరుగున పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందినా, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమల్లోకి రాని పలు చట్టాలను ఉదహరిస్తున్నారు.
2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు దేశంలోకి వలసవచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్సీ మతాల వారికి పౌరసత్వాన్ని మంజూరు చేసే ఉద్దేశంతో 2019లో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తీసుకొచ్చింది. డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేశాయి. జనవరి 10, 2020 నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, సీఏఏలోని కొన్ని క్లాజులు కొన్ని వర్గాలపై వివక్షాపూరితంగా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను సరిగ్గా ఇవ్వని కేంద్రం.. చట్టంలో నిబంధనలను సవరిస్తామని ఇప్పటివరకూ ఏడుసార్లు గడువును పొడిగించింది. దీంతో ఈ చట్టానికి రాజముద్ర పడినప్పటికీ అమలుకు నోచుకోలేదు.
అసలైన భారత పౌరులెవరో, అక్రమ వలసదారులెవరో గుర్తించేందుకు 2019లో కేంద్రం జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని తీసుకొచ్చింది. 1971, మార్చి 24 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చి, రికార్డుల్లో నమోదుకాని వలసదారుల సంఖ్యను గుర్తించే కసరత్తు ఇది. ఇప్పటికీ ఇది అమల్లోకి రాలేదు. ఇక, జనగణనకు కాపీగా 2019లోనే తీసుకొచ్చి విమర్శలపాలైన జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) అమలు ఇప్పటివరకు ఐదుసార్లు వాయిదా పడింది.
2014 నుంచి ఇప్పటివరకూ 40కి పైగా బిల్లులు పార్లమెంట్ ఉభయసభల ముందు పెండింగ్లోనే ఉన్నాయి. ఇందులో 12 బిల్లులకు లోక్సభ, మరో 10 బిల్లులకు రాజ్యసభ, మరో 3-4 బిల్లులకు ఉభయసభల ఆమోదం లభించినప్పటికీ, ఇప్పటివరకూ ఆ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి మాత్రం రాలేదు.
రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల సమయంలో బిల్లులే కాదు పలు నినాదాలను ఇవ్వడం ఆ తర్వాత వాటిని పక్కనబెట్టడం బీజేపీకి అలవాటే. 2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్’ నినాదమిచ్చిన ప్రధాని మోదీ ఐదేండ్లు తిరిగే నాటికి దాన్ని పక్కనబెట్టేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ‘న్యూ ఇండియా-2022’ అంటూ మరో నినాదాన్ని ఎత్తుకొన్నారు. 2021లో దాన్నీ వదిలేసి ‘2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక’ వ్యవస్థ అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు 2047 నాటికి పంచ ప్రాణాల ఆవిష్కరణ అంటూ వజ్రోత్సవ సంబురాల్లో కొత్త ప్రకటన చేశారు. అయితే, ఇప్పటివరకూ ఏ ఒక్కటీ సాకారం కాలేదు. సాక్షాత్తూ ప్రధాని ప్రకటించిన 100 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక భ్రమ అని, నీటిలో కనిపించే జాబిల్లి వంటిదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. రిజర్వేషన్ల చట్టం కొన్నేండ్ల పాటు అమల్లోకి రాదని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా మహిళా బిల్లు చట్టంగా మారొచ్చేమో కానీ, వాస్తవంలోకి రావడానికి చాలా ఏండ్లు పడుతుందని అన్నారు. 2029 లోక్సభ ఎన్నికల కంటే ముందు రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు, ఈ చట్టం ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక ఎన్నికల జుమ్లా మాత్రమేనని చిదంబరం ఎక్స్ వేదికగా మోదీ సర్కార్ను విమర్శలు గుప్పించారు. ఎలక్టోరల్ బాండ్లను ‘చట్టబద్ధమైన లంచం’గా చిదంబరం మరో పోస్టులో అభివర్ణించారు. ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి బంగారు పంట అయిందని, దాదాపు 90 శాతం ఆ పార్టీకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఢిల్లీలోని తమ దేవుడు, మాస్టర్కు చెక్కులు రాసి ఇచ్చేస్తున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి చిదంబరం అన్నారు. కాగా, మరోవైపు మహిళా రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత అబ్దుల్ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్లోని ముజఫర్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల పేరుతో లిప్స్టిక్లు, బాండ్ కట్ హైర్ైస్టెల్స్ ఉన్నవారే ముందుకొస్తారని అన్నారు. వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.