న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కలిసి ఉన్న తన ఫొటోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో చూపడంపై వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) మండిపడ్డారు. ఒకవైపు మణిపూర్ మండిపోతుంటే, మరోవైపు పార్లమెంట్లో లేని తన గురించి వ్యతిరేకంగా ఆమె మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. అలాగే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించిన స్మృతి ఇరానీ దీనిని నిరూపించాలని సవాల్ చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లంగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన మహిళా రెజ్లర్లను స్మృతి ఇరానీ ఎందుకు కలువలేదని ప్రశ్నించారు.
కాగా, పార్లమెంట్ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానని రాబర్ట్ వాద్రా తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన పేరును ప్రస్తావించినప్పుడు మాత్రమే దానిపై తాను స్పందిస్తానని చెప్పారు. గత తొమ్మిదేండ్లుగా కేంద్రం ఇరుకునపడిన సందర్భాల్లో తన పేరును వినియోగిస్తున్నదని, అందుకే తాను దీనిపై పోరాడుతున్నానని అన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఏదీ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.
మరోవైపు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’లో కాంగ్రెస్ పార్టీ చేరిందని రాబర్ట్ వాద్రా తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. అలాగే తన భార్య ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ఉండాలని తాను భావిస్తున్నానని అన్నారు. దీనికి ఆమె అర్హురాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ప్లాన్ చేస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
VIDEO | "Congress has joined the opposition alliance 'INDIA' and we will give them (NDA) a good fight in the 2024 Lok Sabha elections," says @irobertvadra. pic.twitter.com/thhFioCPow
— Press Trust of India (@PTI_News) August 12, 2023