BRS | నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్, ఏప్రిల్ 28: ఒక ముసలి రైతు కింద పడతానన్న భయమైనా లేకుండా ఎందుకు చెట్టెక్కి మరీ కేసీఆర్ను చూడాలనుకుంటున్నడు? బస్సు కింద పడతానేమో అన్న జంకు లేకుండా ఒక మహిళ ఎందుకు కేసీఆర్ కర స్పర్శ కోసం గొంతు చినిగిపోయేలా అరుస్తూ వెంట బడింది? అమలైన, అమలు కాని హామీలను కూడా తప్పుబడుతూ మరో మహిళ ఎందుకు కాంగ్రెస్ పరిపాలనను, సీఎం రేవంత్రెడ్డిని బూతులు తిడుతూ విమర్శిస్తున్నది? ఇప్పుడు ఎన్నికలు పెడితే కేసీఆరే వస్తడు అని ఐలవ్వ ఎందుకంటున్నది? రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి ఇవి నిదర్శనాలా? వాతావరణంలో వస్తున్న ‘మార్పు’నకు ఇవి సూచికలా? రేపటి ఫలితాలకు ఇవి ఇవాళ్టి సంకేతాలా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి, అంతకు ముందు, తర్వాత జరిగిన దుష్ప్రచారం నేపథ్యంగా లోక్సభ ఎన్నికల ముంగిట నిలిచిన బీఆర్ఎస్లో కొంత నైరాశ్యం కనిపించింది. పార్టీ పోరాట పటిమ, విజయావకాశాలపై రకరకాల అనుమానాలు అంచనాలు వ్యక్తమయ్యాయి. క్యాడర్ సైతం కొంత నిస్తేజానికి గురైంది. కానీ గత వారం రోజులుగా జరిగిన పరిణామాలు ఈ సందేహాలను పటాపంచలు చేయడమే కాదు; బీఆర్ఎస్ను రాజకీయంగా మళ్లీ అగ్రస్థానంలోకి తెచ్చి నిలబెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా ఒక ప్రముఖ టీవీ చానల్కు మాజీ సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతి రోజు నుంచే మార్పు మొదలైందని, ఆ తెల్లారి నుంచి కేసీఆర్ నిర్వహిస్తున్న రోడ్షోలు పరిస్థితిని తల్లకిందులు చేసాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు వివాదాస్పద అంశాలపై, తనపై, పార్టీపై ఇంతకాలం జరిగిన దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడంతో ప్రజల్లో ఒకరకమైన రియలైజేషన్ వచ్చిందని, బీఆర్ఎస్ను ఓడించి తాము తప్పు చేసామా? అన్న పునరాలోచన మొదలైందని సీనియర్ పాత్రికేయుడొకరు పేర్కొన్నారు.
ఇక రోడ్షోల్లో కేసీఆర్ సూటిగా, సుత్తి లేకుండా, సంభాషణ పూర్వకంగా ఇస్తున్న సందేశంతో జనం బీఆర్ఎస్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి పునాది వేస్తున్నది ఆయన వివరించారు. రోడ్షోల్లో కేసీఆర్ వేస్తున్న ప్రశ్నలకు ప్రజలు స్పందిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. “ఇప్పటికి ఐదు రోజుల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్లలో ఆరు రోడ్షోలు జరిగాయి. వీటిని గమనించిన ఎవరైనా, లోక్సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఉండవని తెగేసి చెప్పవచ్చు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు దీన్ని గుర్తించాయి. అందుకే అవి మళ్లీ కదనోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు అంటే అదేదో ఢిల్లీకి సంబంధించిన అంశమే కాదు; మనకు, మన రాష్ర్టానికి సంబంధించినది కూడా అనేదాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే తమకు, తెలంగాణకు లాభం జరుగుంది? అనే అంశాలపై కేసీఆర్ మాటలతో ప్రజల ఆలోచన విధానంలో మార్పు మొదలైంది అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం.
అనూహ్యంగా పుంజుకున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఫలితాల తర్వాత, లోకసభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ ప్రభావాన్ని కాంగ్రెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేసాయి. దీన్ని బీఆర్ఎస్ ఒక్కసారిగా తలకిందులు చేసింది. కేసీఆర్ జనంలోకి రావడం, బలమైన సందేశాన్ని ఇస్తుండడంతో పాటు కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం, కరువును ఎదుర్కొనడంలో చేతగానితనం, వ్యవసాయ సంక్షోభం, రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
“ఈ ఎన్నికలు కూడా కేసీఆర్ను తిట్టి గెలవొచ్చన్న కాంగ్రెస్ వ్యూహం ఎదురు తన్నింది. పనిచేయాలని అధికారమిస్తే, కేసీఆర్ను తిట్టి పబ్బంగడుపుకొంటానంటే ఎట్లా? అన్నది ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న. అదీగాక ఓవర్ కాన్ఫిడెన్స్తో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. దాదాపు 10-11 చోట్ల ఆ పార్టీ దారుణంగా దెబ్బతినబోతున్నది. “సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి కాదు; కాంగ్రెస్ క్యాడర్ నుంచే ఆమోదం లేదు.
ప్రజాభిమానం కోల్పోయిన, బీఆర్ఎస్కు భారంగా మారిన వాళ్లను తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్థులుగా పెట్టుకోవడం వ్యూహాత్మక తప్పిదం” అని కాంగ్రెస్కే చెందిన ఒక సీనియర్ నేత విశ్లేషించారు. “కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి జారిపోయింది. ఈ సీట్లలో పరిస్థితిని అంచనావేయడంలో మా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది“ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఖమ్మం అభ్యర్థి ఎంపికలోనూ కాంగ్రెస్ తప్పు చేసిందని, ఒక్కసారి మినహా ఎన్నడూ రెడ్డి సామాజిక వర్గం గెలవని ఖమ్మంలో రెడ్డికి సీట్లు ఇవ్వడం, దీనిపై మంత్రులు, సీనియర్ల మధ్య కీచులాటలు కాంగ్రెస్ను పెను దెబ్బ తీయబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మంలో ప్రధాన సామాజికవర్గం బీఆర్ఎస్కే అండగా నిలవనుందని ఆయన స్పష్టంచేశారు. “కేసీఆర్ రాజకీయ అనుభవం, విసిరిన పాచికలకు చేవెళ్ల, ఖమ్మం, వరంగల్ మంచి ఉదాహరణలు, కేసీఆర్ ఎత్తుగడలు ఆ పార్టీకి అనూహ్య లాభం కలిగించబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ రెండు జాతీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. ఇందులో బీఆర్ఎస్కు ఏ రోల్ ఉండదనే అభిప్రాయాన్ని ఆయన పటాపంచలు చేశారు.
కేసీఆర్ రాజకీయ అనుభవం, గ్రౌండ్ని బీఆర్ఎస్ వర్సెస్ అన్నట్టుగా మార్చివేసింది. హైదరాబాద్ను మినహాయిస్తే మొత్తం 16 సీట్లలో దాదాపు 10-11 చోట్ల ఇప్పుడు బీఆర్ఎస్- బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, నాలుగైదు చోట్ల బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్సే ఫస్ట్ప్లేస్లో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ సాధించే స్థానాల్లో సగం కాంగ్రెస్, అందులో సగం బీజేపీకి వచ్చే అవకాశం ఉంది” అని రాష్ట్ర ఎన్నికలపై కచ్చితమైన అంచనాలు ఇచ్చే సెఫాలజిస్టు ఒకరు పేర్కొన్నారు.
పోలింగ్కు ఇంకా 15 రోజులు ఉన్నందున, వాతావరణం మరింత స్వింగ్ అవుతుందని, అదే జరిగితే బీఆర్ఎస్ సంఖ్య మరింత పెరిగి, బీజేపీ జీరో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. “బీజేపీ విషయంలో నెల రోజుల క్రితం ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. నాయకత్వ లోపం, బీఆర్ఎస్కు లయబిలిటీగా మారారనే పేరున్న (జహీరాబాద్, వరంగల్, నల్లగొండ) అభ్యర్థులను తెచ్చుకుని నిలబెట్టడం ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసింది. మోదీకున్న తెలంగాణ వ్యతిరేకత, రాష్ర్టానికి పదేండ్లుగా చేసిన అన్యాయం కూడా ఆలోచనాపరులను ఆలోచింపజేస్తున్నది” అని మరో పాత్రికేయుడు పేర్కొన్నారు.
మైనారిటీలు, దళితుల్లో పరివర్తన
అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన మైనారిటీ, దళితవర్గాలు క్రమంగా బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తున్నారని క్షేత్రస్థాయి వాతావరణం స్పష్టం చేస్తున్నది. బీజేపీ గెలవకుండా చూడడమే మైనారిటీల లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా చూసినా, రాష్ట్రంలో చూసినా బీజేపీకి ఎదురొడ్డి నిలిచే సత్తా కాంగ్రెస్కు ఉన్నట్టు కనిపించడం లేదు. అందువల్ల ఈసారి మైనారిటీల ఓటు బీఆర్ఎస్కే పడుతుంది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘మేము ఏదో అనుకున్నాం. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు చేసిందే నిజం. చెప్తున్నదే వాస్తవం.
ఈ ఎన్నికల్లో మేం మీ వెంటే ఉంటాం’ అని మహబూబ్నగర్ రోడ్షో తర్వాత స్థానిక ముస్లిం పెద్దలు కేసీఆర్ను కలిసి పేర్కొనడం గమనార్హం. బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలవనే అభిప్రాయం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో వ్యాపిస్తున్నది. దీనికి తోడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్కు బీజేపీతో సంబంధాలున్నాయని, ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరతారని బీజేపీ నేతలే స్వయంగా ప్రకటిస్తుండడం, వీటిని ఆయన ఖండించకపోవడం కూడా మైనారిటీలను పునరాలోచనలో పడేసాయి.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ప్రజలను విస్మరించిన తీరు, ఇప్పుడు రాష్ట్రంలోనే అదే జరుగుతుండడంతో మధ్యతరగతి, మేధావి వర్గం పునరాలోచనలో పడింది. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కే ఉందని పదేండ్ల ఆ పార్టీ పాలన రుజువు చేసిందని మైనారిటీ, దళితవర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాలోని మైనారిటీ పెద్దల అభిప్రాయమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలోని మైనారిటీ వర్గం తిరిగి బీఆర్ఎస్వైపునకు మళ్లిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నిర్వహిస్తున్న సమావేశాల్లో, కేసీఆర్ రోడ్షోల్లో మైనారిటీలే అత్యధికంగా పాల్గొంటుండడం ఆ వాదనకు బలం చేకూరుస్తున్నది. దళితుల్లో కేవలం మాల సామాజిక వర్గాన్ని, అదీ సంపన్న వర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా నిలిపిందని, తెలంగాణలో అత్యధికంగా ఉన్న తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని మాదిగ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉన్నది.
తమకు ఒక్కసీటు ఇవ్వరా అని మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్పై తిరుగుబాటును ప్రకటించింది. దళితవర్గాల్లో నిజాయితీపరుడిగా, ఉన్నతాధికారిగా సేవలు అందించి, గురుకులాలను అద్భుతంగా తీర్చిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లాంటి నాయకుడు బీఆర్ఎస్లో నాగర్కర్నూల్ నుంచి, ఉద్యమకారుడు సుధీర్కుమార్ మాదిగ వరంగల్ నుంచి పోటీ చేస్తుండడంతో బీఆర్ఎస్ను మాదిగలకు దగ్గర చేసింది. దళితజాతి గర్వపడే మంద కృష్ణమాదిగ కాంగ్రెస్ పార్టీపై ఒకరకంగా యుద్ధమే ప్రకటించారు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఆ మార్పు కచ్చితంగా బీఆర్ఎస్వైపే తిరుగుతున్నదని, రానున్న రోజుల్లో ఇది మరింత బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా.
ఇది మిర్యాలగూడలో..
చొక్కా వేసుకుని ఉన్న ఓ యువతి సెక్యూరిటీని ఛేదించుకుని కేసీఆర్ బస్సు వద్దకు పరిగెత్తుకొచ్చింది. ‘కేసీఆర్ సార్..’ అని పిలుస్తూ అరచేతిని కిటికీ అద్దంపై ఉంచింది. అవతలివైపు కేసీఆర్ కూడా అద్దంపై అరచేతిని ఉంచారు. కరచాలనం చేసేదాక వదలని అభిమాని అప్యాయత అది.
ఇది నాగర్కర్నూల్లో..
కేసీఆర్ నాగర్కర్నూల్ రోడ్షోలో కనిపించిందీ దృశ్యం. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఓ రైతు
ఇలా చెట్టెక్కాడు. కేసీఆర్ రాక కోసం రాష్ట్ర రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారనేందుకు, ఆయన ప్రతి మాటను చాలా ఆసక్తిగా వింటున్నారనేందుకు ఇదో నిదర్శనం.
ఇది జనగామలో..
జనగామ మార్కెట్లో ఓ మహిళా రైతును యూట్యూబ్ విలేకరి పలకరించాడు. వడ్లకొనుగోళ్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఆమె ఒక్కసారిగా విరుచుకుపడింది. కాంగ్రెస్ పాలనపై సగటు రైతు
ఆవేదనను కడుపుమండిన భాషలో వెళ్లగక్కింది.
ఇది గజ్వేల్లో..
గజ్వేల్ కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కరపత్రం తీసుకుంటూ ఆవేదన వ్యక్తంచేసింది ఐలవ్వ. తెల్వక కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినమని వాపోయింది. ఎన్నికలు మళ్లాపెడితే కేసీఆరే గెలుస్తడని చెప్పింది.