చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల కుటుంబాలకు పరిహారం తదితర హమీల అమలులో మోదీ సర్కార్ చేసిన ద్రోహంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి నిరసనగా ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు పంజాబ్, హర్యానా రైతులు ఆదివారం రైలురోకో చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయించి మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పంజాబ్లోని జలంధర్, ఫిల్లౌర్, ఫిరోజ్పూర్, బఠిండా.. హర్యానాలోని హిసార్, ఝజ్జర్, సోనిపట్, కర్నాల్ తదితర నగరాల్లో ఆందోళనలు జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన రైతుల ఆందోళనలతో రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని, లఖింపూర్ కేసులో న్యాయం చేయాలని రైతు నేత హరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ బూటకమని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నవారిని, నల్ల చట్టాలను గట్టిగా సమర్థించిన అధికారులను, రైతుల పేరుతో పలువురిని నియమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.