న్యూఢిల్లీ : జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాదం ఇటీవల పేట్రేగిపోతుండటంపై ప్రశ్నించగా బ్రిటన్లో తీవ్రవాదం లేదా ఏ రూపంలోనైనా హింసను ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వంతో బ్రిటన్ కలిసి పనిచేస్తోందని చెప్పారు.
ఈ తరహా తీవ్రవాదం సరైందని తాను అనుకోవడం లేదని చెబుతూ ఈ వ్యవహారంపై భారత్తో మాట్లాడేందుకు తమ భద్రతా వ్యవహారాల మంత్రి ఇటీవల ఇక్కడ పర్యటించారని గుర్తుచేశారు. హింసాత్మక తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఇంటెలిజెన్స్, సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు తమ వర్కింగ్ గ్రూప్లు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
లండన్లో ఇటీవల ఖలిస్తాన్ అనుకూల శక్తులు భారత రాయబార కార్యాలయంపై దాడిచేశాయి. భవనం ఎదురుగా ఉన్న స్తంభానికి త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగివేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక జీ20 భేటీలో పాల్గొనేందుకు భార్య అక్షత మూర్తితో కలిసి రిషి సునాక్ ఢిల్లీ చేరుకోగా విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అశ్వని చూబే, భారత్లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిస్, సీనియర్ దౌత్యాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
Read More :
G20 Meeting: మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడకు ఆహ్వానం.. మల్లిఖార్జున్ ఖర్గేకు అందని ఆహ్వానం