Odisha Train Accident | ఇది హృదయ విదారకం.. ఒకరిద్దరు కాదు.. వందలాది మంది ప్రయాణికులను పొట్టనబెట్టుకున్న ప్రమాదం ఇది. పట్టాలపై రక్తపుటేరులు పారాయి. బోగీల్లో మరణ మృదంగం మోగింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లింది. భారత రైల్వే చరిత్రలో ఇంతటి ఘోరమైన ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహనగా ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రభుత్వ పాఠశాల.. మార్చురీగా మారిపోయింది. ఆ మృతుల్లో తమ వారెవరైనా ఉన్నారో అని తెలుసుకునేందుకు ఆ పాఠశాల వద్దకు జనాలు క్యూ కట్టారు. కానీ మృతదేహాలను గుర్తించలేని స్థితిలో మారిపోయాయి.
అయితే పలు మృతదేహాల వద్ద మొబైల్స్ ఫోన్స్ మోగాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న తమ వారు క్షేమంగా ఉన్నారో.. లేదో తెలుసుకునేందుకు ఆత్మీయులు, బంధువులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆ ఫోన్ కాల్స్ వల్ల మృతదేహాలను గుర్తించడం తేలికైంది. తమ బంధువులు, ఆత్మీయులు ఫోన్లు చేస్తుండటంతో.. ఆ ఫోన్లను అధికారులు, పోలీసులు లిఫ్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో పలు మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా బెంగాల్కు చెందిన మైతీ అనే వ్యక్తి మాట్లాడుతూ.. మా గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరైన బోహ్లానాథ్ గిరి.. కోరమండల్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి బయల్దేరారు. ఈ ప్రమాద వార్త విని.. తాము ఆందోళనకు గురై గిరికి ఫోన్ చేశాము. అప్పుడు ఓ వ్యక్తి గిరి ఫోన్ లిఫ్ట్ చేసి చనిపోయాడని చెప్పాడు. దాంతో తాము బహనగా వచ్చి తమ స్నేహితుడి మృతదేహాన్ని కనుగొన్నామని మైతీ తెలిపాడు.