అయోధ్య, సెప్టెంబర్ 28: విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా అన్నం, ఉప్పు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకొన్నది. అయోధ్య జిల్లా బికాపూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కూరకు బదులు ఉప్పుతో కలిపిన అన్నాన్ని వడ్డించారు. దీన్ని వీడియో తీసిన వ్యక్తి.. దీనికి ఎవరు బాధ్యులు? యోగి బాబా ఈ వీడియో చూడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరలైంది. పాఠశాల వెలుపల విద్యార్థి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటన మంగళవారం జరిగిందని, పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశామని జిల్లా కలెక్టర్ నితీశ్కుమార్ తెలిపారు. కాగా, ఘటనపై నెటిజన్లు బీజేపీ సర్కారు పాలనను ఎండగడుతున్నారు. విద్యార్థులకు పెట్టే తిండి ఇదా? ఇదేనా డబుల్ ఇంజిన్ పాలన? అని నిలదీస్తున్నారు. గతంలోనూ యూపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోటీ, ఉప్పు వడ్డించారు.