కోల్కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీ కర్ బాధితురాలి తల్లి పోటీ చేస్తున్నది. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరు ఉన్నది. పానిహటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెను నామినేట్ చేసింది. (Bengal Polls) 2024 ఆగస్ట్ 9న కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగాయి. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బెంగాల్లో నెలకు పైగా వైద్యుల నిరసనలు కొనసాగాయి.
కాగా, ఆర్జీ కర్ హత్యాచారం కేసు దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ఇటీవల వారిద్దరూ బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆర్జీ కర్ బాధితురాలి తల్లిని బెంగాల్ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీ నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడింది. ‘నేను గెలిస్తే, పానిహటి ప్రజలు గెలుస్తారు. నిరసన తెలుపడం ఎలాగో మరిచిపోయిన వారి కోసం నా గొంతు వినిపిస్తా’ అని అన్నారు.
అయితే ఎన్నికల్లో పోటీ చేయడం తనకు గర్వకారణం కాదని, ఒక బాధాకరమైన బాధ్యత అని ఆమె తెలిపారు. ‘నేను ప్రజలకు సేవ చేయగలిగితే నా కూతురు సంతోషిస్తుంది. పశ్చిమ బెంగాల్ అంతటా కమలం వికసించాలి. తృణమూల్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించాలని నేను కోరుకుంటున్నా’ అని అన్నారు.
మరోవైపు ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బీజేపీ నుంచి పోటీ చేయడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాస్వామ్య హక్కు ఆమెకు ఉన్నదని ఆ పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ అన్నారు. కానీ ‘తన కుమార్తె కేసును సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని, ఢిల్లీలో హోం మంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ లభించలేదని ఆరోపించిన తర్వాత ఆమె బీజేపీని ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. దీని వెనుక ఏముంది?’ అని ఆయన ప్రశ్నించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read:
Railways Fines IRCTC | సొంత సంస్థ ‘ఐఆర్సీటీసీ’కు.. రూ.10 లక్షల జరిమానా విధించిన రైల్వే
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్
Tanker with Russian oil struck | రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్పై.. డ్రోన్ బోటు దాడి