న్యూఢిల్లీ: ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రవేశాలు, అధ్యాపక నియామకాల్లో రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఐఐటీ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించేలా ఆదేశించాలని ఎస్ఎన్ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో నియామకాలకు సంబంధించి పారదర్శక విధానం పాటించడం లేదని, అనర్హులు నియమితులవుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వేషన్ల నిబంధనలను పూర్తిగా అతిక్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం.. ఐఐటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.