Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఎంతోమంది జీవితాలను చిధ్రం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ ఆప్తుల కోసం పలువురు మార్చురీల చుట్టూ తిరుగుతుంటే.. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు కోల్పోయిన క్షతగాత్రుల హాహాకారాలతో ఆస్పత్రులు మార్మోగుతున్నాయి. బాలాసోర్ ప్రమాదం జరిగినప్పటి నుంచి వీటికి సంబంధించిన హృదయ విదారక ఘటనల గురించి వింటూనే ఉన్నాం. కానీ ఈ విషాదం మిగిల్చిన కష్టం మరొకటి ఉంది.
యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన మరుక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొన్న సిబ్బందిలో పలువురు మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్లలో కొందరు మంచి నీళ్లను చూసినా కూడా నెత్తురేమో అని భ్రమపడిపోతున్నారు. భయపడిపోతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి మూడు రోజులు ప్రమాదస్థలిలోనే గడిపిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తింది.
ఎక్కడ చూసినా మృతదేహాల కుప్పలు.. తెగిపడిన శరీర భాగాలు, బోగీల మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల హాహాకారాలు. రక్తంతో తడిసిసోయిన రైలు పట్టాలు, నాన్నా, అమ్మా, బిడ్డా ఎక్కడున్నావ్? అంటూ బంధువుల రోదనలు.. వీటన్నింటిని ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది దగ్గర నుంచి చూశారు. అంతటి భీతవాహ వాతావరణంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అది ఇప్పుడు వాళ్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. ‘ రక్తపుధారలతో నిండిపోయిన బోగీల్లో మా సిబ్బంది పనిచేశారు. బోగీల నడుమ నుజ్జునుజ్జయిన మృతదేహాలను వెలికితీయడంలో సహాయపడ్డారు. అలాంటివి చూసిన సిబ్బంది మానసికంగా చాలా దెబ్బతిన్నారు. ‘ అని అతుల్ కర్వాల్ పేర్కొన్నారు. వాళ్లలో ఒకరు నీళ్లను చూసినా కూడా రక్తాన్ని చూసినట్టే భ్రమ కలుగుతుందని తనకు చెప్పారని తెలిపారు. ఇంకొకరికి అయితే ఈ సహాయక చర్యల తర్వాత ఆకలి చచ్చిపోయిందని.. అతను భోజనం కూడా చేయలేకపోతున్నారని చెప్పారు. ఇలా మానసికంగా దెబ్బతిన్న తమ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని వెల్లడించారు.