International Flights | అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏప్రిల్ కల్లా పునః ప్రారంభం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనాతో రెండేండ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభించే విషయమై కేంద్ర హోం, ఆరోగ్యశాఖలతో పౌర విమానయాన శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. మార్చిలో లేదా ఏప్రిల్లో రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కోవిడ్ వల్ల 2020 మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సహా పలు దేశాలతో విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రం ఒప్పందాలు చేసుకుంది. తదనుగుణంగా ఆయా దేశాలకు భారత్ ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నది.
అయితే, గతేడాది డిసెంబర్ 15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభించాలని కేంద్రం భావించింది. కానీ కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడంతో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నది. ప్రస్తుతం ఈనెలాఖరు వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల మధ్య రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.