Karnataka High Court | కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యతో శారీరక సంబంధాన్ని భర్త నిరాకరించడం తప్పేమీ కాదని తెలిపింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది క్రూరమే అయినప్పటికీ, ఐపీసీ సెక్షన్ 498 ఏ (IPC 498A) ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న భర్త.. తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఓ భార్య పెట్టిన కేసు విచారణలో భాగంగా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. 2019, డిసెంబర్ 18న ఓ మహిళకు వివాహమైంది. అయితే, భర్త అప్పటికే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తుండటంతో సదరు మహిళతో శారీరక సంబంధానికి నిరాకరించాడు. దీంతో పెళ్లైన 28 రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2020లో భర్త, అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498 ఏ, వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. అదేవిధంగా హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, కాబట్టి పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది.
ఆమె పిటిషన్ ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు 2022 నవంబరులో వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయితే అత్తింటి వారిపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆమె భర్త కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించాడు. తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్ షీట్ ను కొట్టేయాలని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడన్నది మాత్రమే అతడిపై ఉన్న ఆరోపణ అని, హిందూ వివాహ (Hindu Marriage) చట్టం ప్రకారం ఇది క్రూరత్వమే అయినా, సెక్షన్ 498ఏ ప్రకారం అది క్రిమినల్ నేరం కిందికి రాదని స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అతడు.. ప్రేమ అంటే కేవలం మనుషులకు సంబంధించినది మాత్రమే అని, శారీరక బంధం కాదని విశ్వసించాడని కోర్టు పేర్కొంది. అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నట్లు తెలిపింది.
Also Read..
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Hardik Pandya | వదినకు రూ.లక్ష కాదు.. రూ. 5 లక్షలు ఇస్తా.. పాండ్యా పెళ్లి వీడియో వైరల్