న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా జనవరి 22 నుంచి 26 వరకు ఎర్రకోటను బంద్ చేస్తున్నామని తెలిపారు. గణతంత్ర వేడుకల సందర్భంగా చారిత్రక కట్టడం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ నెల ఆరంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని కాన్వాయ్ని రైతులు అడ్డుకోవడంతో బహిరంగ సభలో పాల్గొనాల్సిన ప్రధాని.. ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చింది. అయితే దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలకు తావులేకుండా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఏడాది జనవరి 24న ప్రారంభమవుతాయి. అయితే ఈసారి ఒక రోజు ముందుగానే జనవరి 23న ఆరంభంకానున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే వేడుకలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ అతిథులు లేకుండానే రిపబ్లిక్డే వేడుకలు నిర్వహించనున్నారని సమాచారం.