Delhi | న్యూఢిల్లీ, జూలై 13: మూడు రోజులుగా వర్షం లేనప్పటికీ..యమునా నది ఉగ్రరూపం చల్లారటం లేదు. గురువారం మధ్యాహ్నం నాటికి 208.65 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వరద ముప్పు పెరుగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఢిల్లీ, యమునా నది సమీప ప్రజల్ని తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వజీరాబాద్, చంద్రావాల్, ఓఖ్లాలోని వాటర్ ప్లాంట్లను మూసేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారుల్ని ఆదేశించారు. దీంతో నగరవాసులు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్ని ఆదివారం వరకు మూసివేయాలని, పలు చోట్ల వాహనాల రాకపోకల్ని నిలిపివేయాలని అధికారులకు సూచించారు. మెట్రో రైళ్ల సేవలు పాక్షికంగా నడుస్తున్నాయి. అత్యవసర సేవల విభాగాలు తప్ప, మిగతా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
వరద సాయం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్మా ట్రామా సెంటర్ వరదనీటిలో చిక్కుకుపోయింది. దీంతో 40 మంది రోగుల్ని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు మార్చారు.
ఢిల్లీ సీఎం అధికారిక నివాసం, సచివాలయం, మంత్రుల ఇండ్లు, ఎర్రకోట, రాజ్ఘాట్..ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున చేరింది. ఎర్రకోటలో సందర్శకుల ప్రవేశాన్ని శుక్రవారం వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వరద నీటి కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆస్తులు పోగొట్టుకున్నా..
పెరుగుతున్న నగర జనాభా కారణంగా నగరాల్లో వరదలు సవాల్గా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. దేశంలో సంభవిస్తున్న వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని ఆయన తెలిపారు. అదే సమయంలో ఆస్తి నష్టం భారీగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. 2013 నాటి కేదార్నాథ్ వరదలతో తాజా హిమాచల్ వరదలను పోలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.
న్యూఢిల్లీ, జూలై 13: ఉత్తరాది రాష్ర్టాలు వరదల్లో చిక్కుకొని విలవిల్లాడటానికి ప్రధాన కారణం ఆయా రాష్ర్టాల్లో వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థలు లేకపోవడమేనని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. దేశంలోని 75 శాతం జిల్లాలు భారీ వరదల ముంపును ఎదుర్కొంటుండగా వాటిలో 25 శాతం జిల్లాల్లోనే ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు ఉన్నాయని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ నివేదిక తెలిపింది. హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో వరద నష్టానికి ఇదే కారణమని ఆ సంస్థ పేర్కొంది. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు లేకపోవడంతో హిమాచల్ప్రదేశ్ భారీగా నష్టపోయిందని తెలిపింది.