లక్నో: ప్రధాని నరంద్రమోదీ ఇవాళ పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం గోరఖ్పూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సమాజ్వాదిపార్టీపై ప్రధాని విమర్శలు చేశారు. సమాజ్వాది పార్టీని ఉద్దేశించి ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ అని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ కాదని, బీజేపీకే రెడ్ అలర్ట్ అని అఖిలేష్ ట్వీట్ చేశారు. యూపీలో బీజేపీని అధికారం నుంచి దించేది ఎర్ర టోపీలేనని పేర్కొన్నారు. బీజేపీకి ఎర్ర టోపీలేగాక ఇంకా చాలా రెడ్ అలర్ట్లు ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు కూలీలపై దారుణాలు, హత్రాస్ ఘటన, లఖింపూర్ ఖేరీ ఘటన, విద్యావ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ వినాశనం ఇవన్నీ ఎర్ర టోపీలతోపాటుగా బీజేపీకి రెడ్ అలర్ట్లు అన్నారు. వీటిలో బీజేపీని అధికారం నుంచి దించేది ఏదోనంటూ అఖిలేష్ తన హిందీ ట్వీట్ను ముగించారు.