₹ 2,000 Notes | న్యూఢిల్లీ, మే 19: మళ్లీ అదే నిర్ణయం.. ఈసారి రూ.2వేల నోటుకు ఎసరొచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ పేరుతో చలామణిలో ప్రస్తుతమున్న పెద్ద నోటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ బైబై చెప్పేసింది. రూ.2వేల నోట్లు ఇక ఎంతోకాలం చెల్లబోవని ప్రకటించింది. ఆరున్నరేండ్ల కిందట ఎవ్వరూ ఊహించనివిధంగా ముందుకొచ్చిన రూ.2వేల నోటు.. అంతే ఆశ్చర్యకరంగా ఇప్పుడు కనుమరుగైపోతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పి దీన్ని సమర్థించుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇంకేం చెప్పి దీన్ని వెనుకేసుకొచ్చినా.. అప్పుడు.. ఇప్పుడు సామాన్యుడికి, సగటు మనిషికే ఈ కష్టమంతా అని చెప్పక తప్పని నిజం.
మరో తుగ్లక్ నిర్ణయం..
2016 నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కేందుకు రూ.2వేల నోటును ఆగమాగంగా తెచ్చారు. అప్పట్లో ఈ నోటును ఎలాగోలా అందుకున్నామన్న ఆనందం ఒకవైపు.. దాన్ని ఎలా మార్చుకోవాలో తెలియకపడే ఆవేదన మరోవైపు ఉన్నదంటే ఆశ్చర్యం కలుగకమానదు. అలాంటి నోటును ఇప్పుడు ఆర్బీఐ అలవోకగా రద్దు చేస్తున్నట్టు చెప్పేసింది. అవసరం కోసమే ఈ పెద్ద నోటును తెచ్చామని ఆర్బీఐ కూడా తెగేసి చెప్పడం గమనార్హం.
ప్రింటింగ్కు రూ. 1,190 కోట్లు
నల్లధనాన్ని రూపు మార్చడానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును ఎనిమిదేండ్ల తర్వాత రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది. దీంతో ఈ నోటు కోసం ఖర్చు చేసిన వేల కోట్ల ప్రజా ధనం బూడిదపాలైంది. ఒక్కో నోటును ప్రింట్ చేయడానికి రూ.3.54 ఖర్చు అవుతున్నది. అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న 336.3 కోట్ల రూ.2 వేల నోట్ల కోసం రూ.1,190 కోట్ల నిధులు ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ నోటును వెనక్కి తీసుకోవడంతో వెయ్యి కోట్లకు పైగా ప్రజాధనం గంగలో పోసిన పన్నిరైంది. రద్దు చేయబడిన వెయ్యి రూపాయల నోటును ప్రింటింగ్ చేయడానికి అయ్యే రూ.3.54 ఖర్చు కంటే రూ.2 వేల నోటును ప్రింటింగ్ కోసం అయ్యే ఖర్చు 4.18 రూపాయలు. అంటే 64 పైసలు అధికం. పది రూ పాయల నోటును ప్రింటింగ్ చేయడానికి రూ. 1.01 ఖ ర్చు అవుతుండగా.. 20 రూపాయల నోటుకు రూపా యి, అలాగే రూ. 50 నోటుకి రూ.1.01 ఖర్చు చేస్తున్నది రిజర్వుబ్యాంక్.