PM Modi | న్యూఢిల్లీ, మే 19: ఆరేండ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, వ్యాపారాల్ని అస్తవ్యస్థంచేయడంతో ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. మళ్లీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 8.2 శాతం వృద్ధి రేటును మళ్లీ ఆర్థిక వ్యవస్థ సాధించలేకపోయింది. నోట్లు రద్దయిన మూడేండ్లలోనే 6.1 శాతానికి దిగజారిపోయింది. అప్పట్లో పూర్తిగా మూతపడిన చిన్న, మధ్యతరహా వ్యాపారాలేవీ మళ్లీ తెరుచుకోలేదు. పెద్ద నోట్లు ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్కావడంతో బ్యాంక్లు రుణ వితరణ పెంచి మొండి బకాయిల్ని పోగుచేసుకున్నాయి. దేశంలోని మొత్తం వాణిజ్య బ్యాంక్ల స్థూల ఎన్పీఏలు రెండేండ్లలో 7.5 శాతం నుంచి 11.2 శాతం రికార్డుస్థాయికి పెరిగిపోయాయి.
వాటన్నింటి ప్రభావంతో రూపాయి నిలువునా కుప్పకూలిపోయి, ధరలు పెరగడానికి కారణమయ్యింది. రెండేండ్లలో రూపాయి విలువ 12 శాతం పతనమయ్యింది. ఇప్పుడీ రెండు వేల నోట్ల ఉపసంహరణ కూడా ప్రజల్ని, వ్యాపారాల్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. ఈ ప్రకంపనలు శుక్రవారం రాత్రే విదేశీ మార్కెట్లలో కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ తిరిగి ఆల్టైమ్ కనిష్ఠస్థాయిని సమీపించింది. మన ఫారెక్స్ మార్కెట్లో 82.67 వద్ద ముగిసిన రూపాయి రూ.2000 నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత వేగంగా 82.90 స్థాయికి పడిపోయింది.
రోజుల తరబడి బ్యాంక్ల చుట్టూ తిరగాల్సిన ఖర్మ
రెండు లక్షల రూపాయల వరకూ నగదును తమ వద్ద ఉంచుకోవచ్చంటూ ప్రజలకు అనుమతి ఇచ్చిన ఆర్బీఐ ఇప్పుడో కఠిన షరతు విధించింది. ఒక రోజులో కేవలం రూ.20,000 వరకూ మాత్రమే బ్యాంక్ల్లో డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి అనుమతించింది. అంటే రూ.2 లక్షలు మార్చడానికి పది రోజులు తిరగాల్సిందే. ఎంతో మంది పెళ్ళిళ్లు, ఫంక్షన్లు, చదువుల ఫీజులు, కొనుగోళ్లు, ఇతర ఆరోగ్య అవసరాలకు బ్యాంక్ల్లో కాకుండా ఇంట్లోనే నగదు ఉంచుకుంటారు. రూ.2000 నోట్లు అయితే తక్కువ పరిమాణం అయినందున, అవసరాలకు వాటినే అట్టిపెట్టుకునేవారు ఎందరో ఉన్నారు. రిజర్వ్బ్యాంక్ నిర్ణయంతో వారికి రూ.2 లక్షల అవసరం తీరాలంటూ పది రోజులపాటు బ్యాంక్ శాఖల ముందు, క్యాష్ డిపాజిట్ మెషిన్ల ముందు క్యూల్లో మార్చుకోవాల్సిన ఖర్మ పట్టించింది మోదీ సర్కార్ అంటూ వాపోతున్నారు. 2016లో ఇదేతరహాలో పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సందర్భంగా తాము ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందుల్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.