డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సుమారు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే తమ ప్రాణాలు లెక్కచేయని ర్యాట్ హోల్ మైనర్స్ (Rat Miners) ఈ రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ను సత్కరించి ఒక్కొక్కరికి రూ.50,000 చెక్కు అందజేశారు.
కాగా, అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత తమ ప్రాణాలు పణంగా పెట్టి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన తమ సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ర్యాట్ మైనర్స్ ఆరోపించారు. కేవలం రూ.50,000 చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బృంద నాయకుడు వకీల్ హసన్ విమర్శించారు. చిన్న మొత్తంపై ఆనాడే అసంతృప్తి వ్యక్తం చేశామని, అయితే తమ జీవితానికి భరోసా ఇస్తామని చెప్పారన్నారు. తమకు శాశ్వత ఉద్యోగం లేదా నివసించడానికి ఇంటిని ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమకు ఇచ్చిన రూ.50,000 చెక్కులను నగదుగా మార్చుకోబోమని ఆయన అన్నారు.