Pran Pratishtha | సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. వేద పండితులు, సాధువుల సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్ లగ్నం’లో (Abhijit) ఈ వేడుక జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం (auspicious muhurta) నిర్ణయించారు.
ఈ ముహూర్తం కేవలం 84 సెకండ్లు మాత్రమే. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును చేపట్టనున్నారు. ఆ ముహూర్తంలోనే రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దనున్నారు. అనంతరం రామ్ లల్లాకు అద్దాని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇస్తారు. ఈ మహా హారతితో ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగుస్తుంది.
ఇక ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న 7 వేల మంది అతిథులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇప్పటికే అతిథులు అయోధ్య చేరుకున్నారు. ప్రధాని మోదీ సైతం అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సుమారు 4 గంటల పాటు అయోధ్య సన్నిధిలోనే గడపనున్నారు. ప్రాణప్రతిష్ట క్రతువు పూర్తయ్యాక మధ్యాహ్నం 1:15 గంటల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి భక్తులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అయోధ్యలోని కుబేర్ తిలా (Kuber Tila)లో ఉన్న శివ మందిర్ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
Also Read..
Times Square | రామనామ జపంతో మార్మోగిన ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్
Mukesh Ambani | జై శ్రీరామ్ నామాలతో విరాజిల్లిన అంబానీ నివాసం ఆంటిలియా.. VIDEO
Chiranjeevi | ఫ్యామిలీతో కలిసి అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి