Jamili Elections | న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మనదేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించిన కోవింద్ కమిటీ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి నివేదిక సమర్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఆఖరి ఐదు అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్టు తెలిసింది. అంతేకాకుండా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉంచే విషయంపై కూడా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని పలు అధికార, విపక్ష పార్టీల నుంచి, లా కమిషన్, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరించింది.