ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో రాజకీయ నేతల తీరు మారిందని అన్నారు. భారత్ను అస్ధిర పరిచి, విభజించాలని ఎందుకు కోరుకుంటున్నారని పొరుగు దేశాన్ని తాను ప్రశ్నించదలిచానని పేర్కొన్నారు.
ధూలేలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్నాధ్ సింగ్ మాట్లాడుతూ గతంలో ఎయిర్ స్ట్రైక్లు, మెరుపు దాడులు లేవని అయితే మన భూభాగంలో, సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను హతమార్చగలమని మనం ఇప్పుడు విస్పష్ట సంకేతాలు పంపామని అన్నారు. రాజకీయ నేతల మాటలు, చేతల్లో వైరుధ్యాలతో నేతల పట్ల ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం దీన్ని సవాల్గా తీసుకుని ఈ పరిస్ధితులను మార్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాగా భారత్పై దండెత్తిన ఘజ్నావి, అబ్ధాలి వంటి వారి పేర్లను తమ మిసైల్స్కు పాకిస్తాన్ పేర్లు పెడుతోందని గతంలో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పొరుగు దేశం తోసిపుచ్చింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేశ రాజకీయాల్లోకి పాకిస్తాన్ను లాగవద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇటీవల బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.