Rajasthan | హైదరాబాద్, జనవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసిన బీఆర్ఎస్పై లేనిపోని నిందలు వేస్తున్నది. రాజస్థాన్లో ఐదేండ్ల కాంగ్రెస్ పాలనే దీనికి నిదర్శనం.
అప్పుల కుప్ప
రాజస్థాన్లోని విద్యుత్తు కంపెనీలకు రూ. 90 వేల కోట్ల అప్పులు ఉన్నట్టు ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మ తెలిపారు. ఈ రుణాలను తీర్చడానికి, మిత్తిలు కట్టడానికే బడ్జెట్లో మెజారిటీ వాటాను కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు శాఖ పనితీరుపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోతలు లేని కరెంటు సరఫరాకు రోడ్డు మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పెట్టాలంటే పునరుత్పాదక శక్తి వనరుల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ట్రిక్కులు మానుకోవాలి
తక్కువ ధరకే ప్రజలందరికీ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ (రబీ సీజన్) రైతులకు ముఖ్యమైనదని, వారికి కూడా తగినంత విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన విద్యుత్తు కోతలు విధించడం తెలిసిందే. దీంతో సామాన్యులు, రైతులు, పారిశ్రామికవర్గాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే, తమ ప్రభుత్వం కోతలకు పాల్పడలేదని అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్, విద్యుత్తు శాఖాధికారులు మోసపుచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం భజన్లాల్.. విద్యుత్తు సరఫరాకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలన్నారు. విద్యుత్తు లెక్కలను తారుమారు చేసే ట్రిక్కులను మానుకోవాలని అధికారులకు హితవు పలికారు.