న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రాజస్థాన్ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ ముందు నిరసనలకు దిగాయి. రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం సమావేశం నిర్వహిస్తుండగా ఈ నిరసన ప్రదర్శన జరగడం గమనార్హం.
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యతిరేకంగా ఇలాంటి కామెంట్లు రావడం అసాధారణమేమీ కాదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ‘అలాంటి వ్యాఖ్యలు నిజం లేదా అబద్ధం కావొచ్చు. కుట్రలు కూడా ఉండొచ్చు. అంతిమంగా పార్టీ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకొంటుంది. గెలిచే సామర్థ్యం ఉన్నవారికి టికెట్లు ఇస్తుంది. దాన్ని మేమంతా ఆమోదిస్తాం’ అని ఆయన తెలిపారు.